
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం కాదు స్పెషల్ సెంటిమెంట్.. పండగైన, పెళ్లైనా బంగారం కొనాల్సిందే. అయితే గత కొద్ది కాలంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలు ఇవాళ సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. మంగళవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఇవాళ ఒక్కరోజే రెండుసార్లు ధరలు భారీగా పతనం కావడం విశేషం. శుభ ముహూర్తాల వేళ బంగారం ధరలు దిగిరావడంతో కొనుగోలుదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, మార్కెట్ ఒడిదుడుకులతో ఇన్వెస్టర్లలో మాత్రం కొంత ఆందోళన మొదలైంది. సోమవారం నాటి ముగింపు ధరలతో పోల్చుకుంటే, మంగళవారం ఉదయం నుంచే మార్కెట్లో సానుకూల మార్పులు కనిపించాయి. ఉదయం 10 గంటల సమయానికి తులం 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 2,070 తగ్గి, రూ. 1,45,910 వద్ద ట్రేడయ్యింది. ఉదయం తగ్గిన ధరలు అక్కడితో ఆగలేదు. ఉదయంతో పోలిస్తే 24 క్యారెట్ల గోల్డ్ రేట్ మరో రూ. 1,310 పడిపోయింది. దీంతో ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,600 కు చేరింది.
మరోవైపు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై తాజాగా రూ.1,200 తగ్గడంతో, ప్రస్తుతం దీని ధర రూ. 1,32,550 గా నమోదైంది. ఇదే ధర మంగళవారం ఉదయం రూ.1,33,750గా ఉంది. ఇక 18 క్యారెట్ల తులం బంగారం రూ.1,08,450 గా ఉంది. ఈ ధర ఉదయం రూ.1,09,440 గా ఉంది.
బంగారం దారిలోనే వెండి కూడా పరుగులు ఆపింది. కొనుగోలుదారులకు భారీ ఉపశమనం కలిగిస్తూ కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 మేర ధర దిగొచ్చింది. దీంతో దేశీయ మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,45,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. పెళ్ళిళ్ల సీజన్ నడుస్తున్న వేళ, తులం బంగారంపై ఒక్కరోజే ఈ స్థాయిలో భారీగా ధరలు తగ్గడం పసిడి ప్రియులకు పెద్ద ఊరట అనే చెప్పాలి. మరికొద్ది రోజులు ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.