
దేశంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ముందుండగా ఈ పెరుగుదల ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పరిస్థితిపై స్పష్టత ఇచ్చారు. గత శుక్రవారం నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారు ఫ్యూచర్లు కూడా బలంగా ట్రేడ్ అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం, వెండి ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బడ్జెట్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రభుత్వం ధరలను నిశితంగా పరిశీలిస్తోందని, ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా లేదని చెప్పారు. బంగారం భారత కుటుంబాలకు సంప్రదాయ పెట్టుబడి. పండుగల సమయంలో డిమాండ్ పెరగడం సహజం. ధరలు అసాధారణ స్థాయిని దాటాయని ఇప్పుడే చెప్పలేం అని ఆమె పేర్కొన్నారు.
ఆర్థిక మంత్రి వివరించిన ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు తమ రిజర్వులను పెంచుతున్నాయి. ఈ భారీ కొనుగోళ్లు అంతర్జాతీయ మార్కెట్లో ధరలను పైకి నెట్టుతున్నాయని ఆమె చెప్పారు. ఇంకా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ మార్పులు, స్టాక్ మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు కూడా పెట్టుబడిదారులను బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల హెచ్చరికల వంటి జియోపాలిటికల్ అంశాలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయని ఆమె ఉదాహరణగా చెప్పారు.
భారతదేశం ఎక్కువగా దిగుమతి బంగారంపైనే ఆధారపడుతున్న దేశం. దేశీయంగా వినియోగించే బంగారం దాదాపు మొత్తం విదేశాల నుంచే వస్తుంది. డిమాండ్ పెరిగినప్పుడు దిగుమతులపై ఒత్తిడి పెరిగి, ధరలు మరింత ఎగసిపడుతున్నాయని మంత్రి వివరించారు. పరిస్థితిని మెరుగుపరచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవి డిమాండ్ను పూర్తిగా తీర్చడానికి సరిపోవడం లేదని తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి