
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావంతో ప్రపంచ విమానయాన రంగం కోవిడ్-19 తర్వాత అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం ప్రధాన విమానయాన సంస్థల మార్కెట్ విలువలో 50 బిలియన్ డాలర్లకు పైగా నష్టం నమోదైంది. పెరుగుతున్న జెట్ ఇంధన ధరలు, గగనతల ఆంక్షలు, మార్గ మార్పులు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రముగా మార్చుతున్నాయి. యుద్ధం నాలుగో వారంలోకి చేరుతుండగా, విమానయాన సంస్థలు పెరిగిన ఇంధన ఖర్చులను భరించడానికి కష్టపడుతున్నాయి. సాధారణంగా మొత్తం ఖర్చులలో మూడో వంతు ఉండే జెట్ ఇంధన ధరలు గణనీయంగా పెరగడంతో, కంపెనీల లాభాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈజీజెట్ సీఈఓ కెంటన్ జార్విస్ ప్రకారం 2022లో రష్యా, ఉక్రెయిన్ వార్ సమయంలో వచ్చిన ఇంధన షాక్ కంటే ప్రస్తుత పరిస్థితి మరింత తీవ్రమైందని తెలిపారు.
ఈ నేపథ్యంలో టిక్కెట్ ధరలు పెరగడం దాదాపు ఖాయమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. లుఫ్తాన్స సీఈఓ కార్స్టెన్ స్పోర్ ప్రకారం ఒక్కో ప్రయాణికుడిపై సగటు లాభం 10 యూరోలు మాత్రమే ఉండటంతో అదనపు ఖర్చులను భరించడం అసాధ్యమని పేర్కొన్నారు. మరోవైపు విజ్ ఎయిర్, ఈజీజెట్ వంటి సంస్థల షేర్లపై పెట్టుబడిదారుల ఒత్తిడి పెరుగుతోంది. మొత్తం 20 ప్రధాన విమానయాన సంస్థలు కలిపి సుమారు 53 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కోల్పోయినట్లు అంచనా. మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఎమిరేట్స్, ఎత్తిహాద్, ఖతర్ ఎయిర్వేస్ వంటి ప్రధాన సంస్థలు గగనతల పరిమితులు, తగ్గిన డిమాండ్ కారణంగా తమ షెడ్యూళ్లను తగ్గించాయి.
ప్రయాణికుల రాకపోకలతో పాటు సరుకు రవాణా కూడా ప్రభావితమవుతోంది. సముద్ర మార్గాల్లో అంతరాయాల కారణంగా సరుకు రవాణా విమానాలపై ఒత్తిడి పెరగడంతో, ప్రధాన విమానాశ్రయాల్లో రద్దీ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్పై హెచ్చరికలు జారీ చేయడం, హోర్ముజ్ జలసంధి అంశం మరింత ఉద్రిక్తతను పెంచడం పరిస్థితిని క్లిష్టతరం చేస్తున్నాయి. పరిస్థితి త్వరగా చల్లబడకపోతే, ప్రపంచ ప్రయాణ, వాణిజ్య రంగాలపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి