
సాంప్రదాయకంగా నగదు లేదా వస్తువులను బహుమతులుగా ఇచ్చే విధానానికి భిన్నంగా, ఇప్పుడు పెట్టుబడులను గిఫ్ట్గా ఇవ్వాలనే కొత్త ఆలోచన ముందుకు వస్తోంది. ఈ దిశగా SEBI కీలక ప్రతిపాదన చేసింది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ గిఫ్ట్ కార్డ్లు లేదా గిఫ్ట్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIలు) ప్రవేశపెట్టాలని సూచించింది. ఈ విధానం అమలులోకి వస్తే, వ్యక్తులు తమ ప్రియమైన వారికి మ్యూచువల్ ఫండ్ యూనిట్లను బహుమతిగా ఇవ్వగలుగుతారు.
ప్రతిపాదిత విధానం ప్రకారం ఎవరైనా ఈ గిఫ్ట్ కార్డ్లను బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా యూపీఐ ద్వారా కొనుగోలు చేసి, మరొకరికి అందించవచ్చు. గిఫ్ట్ అందుకున్న వ్యక్తి ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి వినియోగించుకోవచ్చు. ఈ కార్డులు జారీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు చెల్లుబాటులో ఉంటాయి. దీంతో బహుమతులు కేవలం వినియోగానికి మాత్రమే కాకుండా, భవిష్యత్ సంపద సృష్టికి మార్గంగా మారనున్నాయి.
అయితే ఈ వ్యవస్థలో పారదర్శకత కోసం కొన్ని పరిమితులను కూడా ప్రతిపాదించారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి గరిష్టంగా రూ.50,000 వరకు మాత్రమే ఈ గిఫ్ట్ కార్డ్ల ద్వారా పెట్టుబడి పెట్టగలడని సెబీ సూచించింది. ఈ పరిమితిని మించితే, ఆ లావాదేవీ స్వయంచాలకంగా రద్దు చేయబడి, డబ్బు తిరిగి చెల్లించబడుతుంది. అవకతవకలను నివారించేందుకు కఠిన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయనున్నారు. ఈ ఆలోచనను ముందుకు తెచ్చింది అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. డిజిటల్ యుగంలో పెట్టుబడులను సులభతరం చేయడం, యువతలో ఆర్థిక అవగాహన పెంచడం ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, బహుమతుల రూపంలో పెట్టుబడులు ఇవ్వడం అనే కొత్త సంస్కృతి దేశంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి