
సాధారణంగా రైళ్లలో వివిధ రకాల కోచ్లు ఉంటాయి. జనరల్ కంపార్ట్మెంట్, రిజర్వేషన్ కంపార్ట్మెంట్, స్లీపర్ కోచ్, ఏసీ కోచ్లు ఉంటాయి. మళ్లీ ఏసీలో కూడా టు, త్రీ చైర్ కోచ్లు ఉంటాయి. అయితే దేనికి టిక్కెట్ తీసుకుంటే అందులోనే ప్రయాణించాలి. స్లీపర్ బెర్త్ టిక్కెట్ కొని, ఏసీ కోచ్లో ప్రయాణిస్తామంటే రైల్వే టీటీఈ ఒప్పుకోరు. నిర్దాక్షిణ్యంగా కిందికి దింపేస్తారు. కానీ, ఓ రైలులో మాత్రం స్లీపర్ బెర్త్ టిక్కెట్ కొన్నవారిని థర్డ్ ఏసీలోకి అనుమతించారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
డెల్టా ఎక్స్ప్రెస్ స్లీపర్ కోచ్ ప్రయాణికులను థర్డ్ ఏసీలో కూర్చోబెట్టారు. అందుకోసం అదనంగా ఏం ఛార్జ్ చేయలేదు కూడా, అందుకు కారణం కోచ్లలో చేసిన మార్పులు చేర్పులు. రెండు స్లీపర్ కోచ్ల ప్రయాణికుల్ని దక్షిణ మధ్య రైల్వే ఉచితంగా థర్డ్ ఏసీకి అప్గ్రేడ్ చేసింది. దీంతో వీరంతా స్లీపర్ టికెట్ ధరతోనే థర్డ్ ఏసీ బోగీల్లో శుక్రవారం ప్రయాణించారు.
కాచిగూడ – రేపల్లె వెళ్లే డెల్టా ఎక్స్ప్రెస్లో గతంలో ఐసీఎఫ్ కోచ్లు ఉండగా తాజాగా ఎల్హెచ్బీకి మార్చారు. ఐసీఎఫ్తో పోలిస్తే ఎల్హెచ్బీలో స్లీపర్ కోచ్ల సంఖ్య తగ్గి థర్డ్ ఏసీ కోచ్లు పెరిగాయి. ఈ రైలు టికెట్ల రిజర్వేషన్ను 60 రోజుల ముందే చేసుకోవచ్చు. దీంతో కొన్ని వారాల క్రితం రిజర్వేషన్ చేసుకున్నవారిలో రెండు స్లీపర్ కోచ్ల ప్రయాణికులకు ఎల్హెచ్బీ కోచ్లుగా మార్చిన తర్వాత సమస్య ఏర్పడింది. దీంతో వారందరినీ కూడా థర్డ్ ఏసీలోకి అనుమతించారు. తక్కువ ధరతోనే కొంతమంది లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి