
ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు) పూర్తిగా సురక్షితమని చాలా మంది భావిస్తారు. అయితే బ్యాంక్ విఫలమైతే డబ్బు మొత్తం తిరిగి రాదనే విషయం చాలా మందికి తెలియదు. భారతదేశంలో డిపాజిట్లకు భీమా అందించేది డీఐసీజీసీ (డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్). డీఐసీజీసీ నియమాల ప్రకారం ఒక బ్యాంకులో ఒక వ్యక్తి పేరుపై ఉన్న మొత్తం డిపాజిట్లకు గరిష్టంగా రూ.5 లక్షల వరకు మాత్రమే భీమా ఉంటుంది. ఇందులో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్డీలు అన్నీ కలిపి లెక్కిస్తారు. ఉదాహరణకు ఒకే బ్యాంకులో రూ.12 లక్షలు ఉంటే, కేవలం రూ.5 లక్షలు మాత్రమే సురక్షితం. మిగిలిన రూ.7 లక్షలు ప్రమాదంలో ఉంటాయి.
చాలామంది రూ.10 లక్షలను ఒకే బ్యాంకులో ఐదు FDలుగా విభజిస్తే రిస్క్ తగ్గుతుందని భావిస్తారు. కానీ ఇది తప్పు. FDల సంఖ్య ఎంత ఉన్నా, ఒకే బ్యాంకులో మొత్తం కవరేజీ రూ.5 లక్షలకే పరిమితం. పెట్టుబడిదారులు తమ డబ్బును వేర్వేరు బ్యాంకుల్లో విభజించడం మంచిది. ఉదాహరణకు రూ.15 లక్షలు ఉంటే, మూడు బ్యాంకుల్లో రూ.5 లక్షల చొప్పున ఉంచితే మొత్తం డబ్బు భీమా పరిధిలోకి వస్తుంది.
ఈ విధంగా ఒకే బ్యాంకులో కూడా ఎక్కువ మొత్తాన్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత, జాయింట్, ట్రస్టీ వంటి వేర్వేరు హోదాలలో ఖాతాలు ఉంటే, ప్రతి ఖాతాకు వేర్వేరు కవరేజీ లభించే అవకాశం ఉంది. అయితే ఇది అన్ని సందర్భాల్లో వర్తించకపోవచ్చు. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇస్తాయి కానీ రిస్క్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, వాటిలో రూ.5 లక్షలకు మించి పెట్టుబడి పెట్టడం జాగ్రత్తగా చేయాలి. ఎక్కువ డబ్బు ఉన్నవారు మొత్తం మొత్తాన్ని FDల్లో పెట్టకుండా, కొంత మొత్తాన్ని ప్రభుత్వ బాండ్లు లేదా ఇతర నాణ్యమైన పెట్టుబడుల్లో పెట్టడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి