
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో భారత ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరటనిచ్చే వార్తను ప్రకటించింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం, పెట్రోల్పై లీటరుకు రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. దీనితో పెట్రోల్పై గతంలో ఉన్న రూ. 13 సుంకం ఇప్పుడు రూ. 3కి చేరింది. అలాగే, డీజిల్పై గతంలో ఉన్న రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ, దానిని సున్నాకు తగ్గించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని సమాచారం.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ప్రపంచ ముడిచమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్పై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ యుద్ధానికి ముందు భారత్ తన చమురు అవసరాల్లో 12 నుంచి 15 శాతం వరకు ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకునేది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా సామాన్యులపై ఆ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు వల్ల నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.