
ఈపీఎఫ్వో కనీస నెలవారీ పెన్షన్ ప్రస్తుతం రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై గత కొన్నేళ్లుగా ఈ విషయంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా ఆందోళన కూడా చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నాయి. ఈపీఎస్-95 పథకం కింద కనీస పెన్షన్ రూ.వెయ్యిగా 2014లో నిర్ణయించారు. అయితే గత 11 ఏళ్లుగా ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. పెరుగుతున్న ఖర్చులు, పెరుగుతున్న ద్రవ్యల్బణం, మెడికల్ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ పరిమితిని పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అందులో భాగంగా మార్చి 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ ఆందోళనల్లో పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొంటున్నారు. ఈపీఎస్-95 జాతీయ ఆందోలన కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఈపీఎఫ్వో కనీస నెలవారీ పెన్షన్ పరిమితి రూ.వెయ్యి ఉండగా.. ప్రస్తుత ఆర్దిక పరిస్ధితుల క్రమంలో రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 30 నుంచి 35 సంవత్సరాలుగా లక్షలాది మంది పెన్షనర్లు ఈపీఎఫ్వోకు విరాళాలు అందిస్తున్నారు. ప్రస్తుతం సగటు నెలవారీ పెన్షన్ రూ.1,171గా ఉంది. అయితే తమ రోజువారీ ఖర్చులను ఈ పెన్షన్ సరిపోవడం లేదని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. అనేక ప్రభుత్వ పథకాలు చందాలు కూడా లేకుండా పెన్షన్ అందిస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ రిటైర్మెంట్ అయ్యాక వృద్దాప ఖర్చులకు సరిపోవడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణంతో పోలిస్తే పెన్షన్ సొమ్ము చాలా తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస పెన్షన్ పరిమితి రూ.7,500కు పెంచి మెరుగైన సామాజిక భద్రత లభిస్తుందని డిమాండ్ చేస్తున్నారు.
డూ ఆర్ డై పేరుతో ఉద్యోగ సంఘాలు ఈ నిరసన చేపడుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని పెన్షనర్లు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనేక రాజకీయ పార్టీల ఎంపీలు కూడా ఈ నిరసనలకు మద్దతు తెలుపుతున్నారు. ఇక పెన్షన్ పరిమితి పెంచడంతో పాటు డియర్ నెస్ అలవెన్స్, కుటుంబ పెన్షన్, పెన్షనర్ల కుటుంబసభ్యులు ఉచిత ఆరోగ్య సంరక్షణ కోసం డిమాండ్ చేస్తున్నారు. నవంబర్ 4,2022న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అర్హులైన ఉద్యోగులందరికీ అధిక పెన్షన్ ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. 8.1 మిలియన్ల మంది పెన్షనర్లు తొమ్మిది ఏళ్లుగా పెన్షన్ లిమిట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి క్లారిటీ రావడం లేదు.