
ఈపీఎఫ్వో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ ద్వారా పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని త్వరలో కల్పించనుంది. ఈ మేరకు ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉండగా.. అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉందని, త్వరలోనే ప్రారంభిస్తామని ఇటీవల కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుసుఖ్ మాండవీయ కూడా ప్రకటించారు. ఈ ఫీచర్ కోసం దేశంలోని 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే సెకన్లలోనే సులువుగా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ సేవలను వినియోగించుకోవాలంటే పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారు 5 వివరాలను అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి అంతరాయం లేకుండా పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. అవేంటి అనేది ఇందులో చూద్దాం.
యూపీఐ ద్వారా పీఎఫ్ నగదును తీసుకోవాలంటే ముందుగా యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. ఇక పాస్వర్డ్ కూడా గుర్తించుకోవాలి. చాలామంది పాస్వర్డ్లను మర్చిపోతుంటారు. అత్యవసరంగా డబ్బులు విత్ డ్రా చేసుకోవాలనుకునే సమయంలో త్వరగా ప్రాసెస్ అవ్వాలంటే ఈ రెండూ గుర్తుంచుకోవాలి. ఇక పీఎఫ్ ఖాతాతో లింక్ అయిన మీ మొబైల్ నెంబర్ ఎస్ఎంఎస్లు అందుకోవడానికి యాక్టివ్గా ఉండాలి. చాలామంది పాత మొబైల్ నెంబర్లను మార్చుకోరు. ఈపీఎఫ్వో వెబ్సైట్లోకి వెళ్లి కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి.
ఇక ఆధార్, పాన్ కార్డుల్లో ఉన్నట్లుగా ఈపీఎఫ్ఓ రికార్డుల్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక అక్షరం తేడా ఉన్నా ఈపీఎఫ్ఓ క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యే అవకాశముంటుంది. దీంతో పాన్ కార్డును ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లో లింక్ చేసుకుని ఉండకపోతే టీడీఎస్ కట్ అవుతుంది. ఇక బ్యాంక్ అకౌంట్ వివరాలు మీ పేరు మీదే ఉండాలి. జాయింట్ అకౌంట్లు, క్లోజ్ అయిన అకౌంట్లు ఉంటే మార్చుకోండి. ఇక ప్రైమరీ యూపీఐ ఐటీ యాక్టివ్గా ఉంచుకోవాలి.
ఇక ఈపీఎఫ్వో పోర్టల్లో ఈ-నామినేషన్ వివరాలు అప్డేట్ చేసుకోవాలి. ఇందులో భాగంగా మీ నామినీ వివరాలను పొందుపర్చాలి. ఇక పాత కంపెనీల పీఎఫ్ అకౌంట్లను ప్రస్తుతం ఉన్న కంపెనీలోకి బదిలీ చేసుకోండి. యాక్టివ్గా ఉన్న ప్రస్తుత కంపెనీలోని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ఐదు అప్డేట్ చేసుకోవడం వల్ల మీరు యూపీఐ ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొరు. వెంటనే ఈ పనులు చేస్కోండి.