
ఈపీఎఫ్వో ఖాతాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త యాప్ను విడుదల చేయనుంది. కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానున్న ఏప్రిల్లో ఈ యాప్ను విడుదల చేసేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. పీఎఫ్ సేవలకు ప్రస్తుతం ఈపీఎఫ్వో పోర్టల్, ఉమాంగ్ యాప్ ఉండగా.. కొత్త యాప్లో అన్నీ సేవలు ఒకేచోట లభించనున్నాయి. అన్నీ సేవలకు ఒకే ఫ్లాట్ఫామ్లా ఈపీఎఫ్వో కొత్త యాప్ ఉపయోగపడనుంది. జస్ట్ మొబైల్లో ఈ యాప్ ద్వారా పీఎఫ్కు సంబంధించిన అన్ని సేవలు పొందే సౌకర్యం లభించనుంది. దీని కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
-యూపీఐ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ను ఇన్స్టంట్గా సెకన్లలోనే విత్ డ్రా చేసుకోవచ్చు
-ఎప్పటికప్పుడు పాస్బుక్ బ్యాలెన్స్ యాక్సెస్ చేసుకోవచ్చు
-క్రెడిట్ హిస్టరీ, ఫండ్ స్టేటస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు
-యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్ ఎప్పటిలాగే ఉంటాయి
-100 డమ్మీ అకౌంట్లను ఉపయోగించి ఈ యాప్ను పరీక్షిస్తున్నారు
ఈపీఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత వేగంగా, సౌకర్యవంతంగా అందించాలనే లక్ష్యంతో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ ఈ కొత్త యాప్ను ప్రవేశపెడుతోంది. కొత్త ఈపీఎఫ్వో యాప్ను రెండు భాగాలుగా విభజిస్తారు. దీర్ఘకాలిక పదవీ విరమణ భద్రతను నిర్వహించుకోవడానికి ఒక భాగంగా ఉండనుంగా.. రెండో భాగంలో యూపీఐ ద్వారా నగదు ఉపసంహరించుకునే ప్రక్రియ ఉండనుంది. మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయబడిన యూపీఐ పిన్ నెంబర్ను ఎంటర్ చేసి మీరు పీఎఫ్ నగదును తక్షణం విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పటివరకు పీఎఫ్ నగదు తీసుకోవాలంటే పోర్టల్లోకి వెళ్లి లేదా ఉమాంగ్ యాప్ ద్వారా క్లెయిమ్కు రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇందుకు అనేక డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. క్లెయిమ్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత అకౌంట్లో జమ కావడానికి మూడు రోజుల సమయం పడుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మంది పీఎఫ్ సబ్స్కైబర్లు ఉన్నారు. దాదాపు 5 కోట్లకుపైగా క్లెయిమ్లు ప్రాసెస్ చేయబడుతున్నాయి. దీంతో ఈ యూపీఐ ఆధారిత పేమెంట్స్ వ్యవస్థ క్లెయిమ్స్ను వేగవంతం చేయనుంది. అలాగే పరిపాలన పనిభారాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఈపీఎఫ్వోకు బ్యాంకింగ్ లైసెన్స్ లేకపోవడంతో పీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా నిధులు తీసుకోవడం సాధ్యం కావడం లేదు. దీంతో బ్యాంకింగ్ ఫ్లాట్ఫామ్ల లాగే ఈపీఎఫ్వో సేవలను సమర్థవంతంగా, స్నేహపూర్వకంగా మార్చడానికి ఈపీఎఫ్వో కృషి చేస్తుంది.