
EPFO సభ్యులకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) డబ్బును ఇకపై సులభంగా UPI ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసుకునే సదుపాయాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ఈ వ్యవస్థకు సంబంధించిన పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం PF డబ్బు తీసుకోవాలంటే సభ్యులు క్లెయిమ్ దాఖలు చేసి, ఆమోదం కోసం కొన్ని రోజులు లేదా వారాలు వేచి ఉండాల్సి వస్తోంది. కొత్త విధానంలో మాత్రం సభ్యులు తమ అర్హత గల PF బ్యాలెన్స్ను చూసి, UPI ద్వారా నేరుగా తమ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం పొందనున్నారు. లావాదేవీల భద్రత కోసం UPI పిన్ ధృవీకరణ కూడా తప్పనిసరి చేయనున్నారు.
ఈ కొత్త విధానం ద్వారా ఏడు కోట్లకు పైగా EPFO సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైన ఉద్యోగులకు ఇది పెద్ద సహాయంగా మారనుంది. డబ్బు బ్యాంక్ ఖాతాలో జమ అయిన తర్వాత సభ్యులు UPI చెల్లింపులు చేయడం, ATMల ద్వారా నగదు తీసుకోవడం వంటి సేవలను సాధారణంగా ఉపయోగించుకోవచ్చు. ఇక ఆటో-సెటిల్మెంట్ వ్యవస్థను కూడా EPFO మరింత విస్తరించింది. ప్రస్తుతం రూ.1 లక్షగా ఉన్న ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. దీంతో అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాల కోసం PF ఉపసంహరణ క్లెయిమ్లు మూడు రోజుల్లోనే మానవ జోక్యం లేకుండా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
సభ్యుల సేవలను మరింత వేగవంతం చేసేందుకు EPFO వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించనుంది. ధృవీకరించబడిన అధికారిక వాట్సాప్ నంబర్కు “Hello” అని మెసేజ్ పంపడం ద్వారా సభ్యులు PF బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. స్థానిక భాషల్లోనే ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. 24 గంటలూ సేవలు అందుబాటులో ఉండటంతో సభ్యులకు మరింత సౌలభ్యం కలగనుంది. అదే సమయంలో, EPFOలో పెండింగ్ వ్యాజ్యాలను తగ్గించే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. వినియోగదారుల కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు మంత్రి వెల్లడించారు. 10 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులను కూడా భారీగా తగ్గించామని చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి