
ఈపీఎఫ్ వడ్డీ రేటు ప్రస్తుతం 8.25 శాతంగా ఉంది. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మేరకు ప్రతిపాదించింది. వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లను యథాతధంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే వడ్డీ రేట్లను పెంచుతారనే వార్తలు వినిపించాయి. అయితే ఈపీఎఫ్వో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు నిరాశకు గురయ్యారు. ప్రతీ ఏడాది మార్చిలోపు వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ ఉంటారు. ఈపీఎఫ్వో నిర్ణయించి కేంద్ర ఆర్ధికశాఖకు పంపుతుంది. కేంద్రం ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత పీఎఫ్ ఖాతాదారులకు వడ్డీ జమ అవుతుంది.
అయితే పీఎఫ్ వడ్డీ రేట్లలో కాలానుగుణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. 1990లో ఏకంగా 12 శాతం ఉంది. 10 ఏళ్ల పాటు అదే వడ్డీ కొనసాగింది. ఆ తర్వాత పడిపోతూ ప్రస్తుతం 8.25 శాతానికి చేరుకుంది. అయితే ఖర్చులు పెరుగుతుండటం, ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేట్లను పెంచాలనే డిమాండ్లు ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. వడ్డీ ఎందుకు పెంచడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీనికి కేంద్రం ఒకే సమాధానం చెబుతూ వస్తోంది. ఈపీఎఫ్ కార్పస్ ఫండ్కు వచ్చే ఆదాయాన్ని బట్టి వడ్డీ రేట్లను నిర్ణయిస్తారని తెలిపింది. ఈపీఎఫ్వో తమ పెట్టుబడులను ప్రభుత్వ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిల్లో పెడుతుంది. వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని బట్టి వడ్డీ రేట్లను నిర్ణయిస్తారు.
1977-78 వరకు 8 శాతంగా పీఎఫ్ వడ్డీ రేటు ఉండగా.. 1984-85 మధ్య 9.90, 1986-87 మధ్య 11 శాతం, 1989-2000 మధ్య 12 శాతం ఉంది. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకునేవారు కేవలం పీఎఫ్ వడ్డీ రేట్లపైనే ఆధారపడటం మంచిది కాదు. ఇతర పెట్టుబడలు మార్గాలను కూడా ఆన్వేషించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకోసం ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు, సూచనలు తీసుకోండి.