
ఈపీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. అడ్వాన్స్ విత్ డ్రా రూల్స్ను మరింత సులభతరం చేసింది. గతంలో పీఎఫ్ సొమ్ము విత్ డ్రా చేయాలంటే కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేసుకునేందుకు వీలు ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఆంక్షలను కేంద్రం తొలగించింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2026 కింద పాక్షికంగా నగదు విత్ డ్రా రూల్స్ను కొత్తగా ప్రవేశపెట్టింది. గతంలో పాక్షిక ఉపసంహరణలకు అనేక కేటగిరీలు ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం మూడు కేటగిరీలను మాత్రమే అందుబాటులో ఉంచింది. దీంతో పీఎఫ్ ఖాతాదారులకు గందరగోళం తొలగిపోయింది. ఇప్పుడు కేవలం అనారోగ్యం, విద్యా, వివాహం, ప్రత్యేక సందర్బాలు అనే మూడు కేటగిరీలు మాత్రమే ఉన్నాయి.
అనారోగ్యం కారణాలతో మీరు పీఎఫ్ నగదును పాక్షికంగా విత్ డ్రా చేసుకునే సుదుపాయం ఉంది. సభ్యులు లేదా కుటుంబసభ్యుల అనారోగ్య పరిస్థితుల సమయంలో అడ్వాన్స్ సొమ్మును తీసుకోవచ్చు. ఇక సభ్యుడు లేదా పిల్లల చదువుల కోసం ఉద్యోగ కాలంలో గరిష్టంగా 10 సార్లు నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఇక వివాహ కారణాలతో సర్వీస్ కాలంలో ఐదుసార్లు అడ్వాన్స్ సొమ్ము తీసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక ఇంటి కొనుగోలు, నిర్మాణం, హోమ్ లోన్ చెల్లించేందుకు ఉద్యోగ మొత్తం కాలంలో గరిష్టంగా ఐదుసార్లు వరకు పాక్షికంగా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే పాక్షికంగా నగదు విత్ డ్రా చేసుకోవాలంటే కనీసం ఈపీఎఫ్ఓలో ఏడాది సర్వీస్ కాలం పూర్తి చేసి ఉండాలి. ఆ తర్వాత అర్హతలను బట్టి తమ వాటా, యజమాని వాటా కలిపి గరిష్టంగా 75 శాతం వరకు తీసుకోవచ్చు.
అయితే పీఎఫ్ అకౌంట్లో తప్పనిసరిగా మినిమం 25 శాతం సొమ్ము ఉండాలి. దీనిని వీరు విత్ డ్రా చేసుకోవడానికి కుదరదు. కేవలం ఉద్యోగం మానేసిన ఏడాది తర్వాత వేరే ఉద్యోగంలో చేరేకపోతే 25 శాతం సొమ్మును కూడా తీసుకోవచ్చు. అక్టోబర్ 2025లో ఈ నిబంధలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదించగా.. జులై 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. మీరు క్లెయిమ్ దాఖలు చేస్తుంటే ముందుగా ఈ రూల్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పీఎఫ్ క్లెయిమ్ దాఖలు చేస్తుంటే ఈపీఎఫ్ పాక్షిక విత్ డ్రా నిబంధనలను పరిశీలించండి. నిబంధనల మేరకు దాఖలు చేస్తే క్లెయిమ్ వెంటనే అందుతుంది.