
సాంప్రదాయ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడిని ఆశించే పెట్టుబడిదారులను ప్రస్తుతం కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు) ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు) అందిస్తున్న FD పథకాలు సంవత్సరానికి 8.95 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తుండటంతో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల FDలపై వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, అధిక రాబడుల కోసం చాలామంది కార్పొరేట్ FDల వైపు మొగ్గు చూపుతున్నారు.
అయితే ఈ అధిక వడ్డీ రేట్ల వెనుక ఉన్న నష్టభయాన్ని కూడా అర్థం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ FDలకు లభించే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) భీమా రక్షణ కార్పొరేట్ FDలకు వర్తించదు. బ్యాంకు విఫలమైతే రూ.5 లక్షల వరకు డిపాజిట్లకు రక్షణ లభించినా, కార్పొరేట్ FDల విషయంలో పెట్టుబడిదారుల డబ్బు భద్రత పూర్తిగా ఆ కంపెనీ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ రేటింగ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రిసిల్, కేర్, ఐసిఆర్ఏ వంటి సంస్థలు కంపెనీల ఆర్థిక బలం, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసి రేటింగ్లు ఇస్తాయి. AAA వంటి అధిక రేటింగ్ ఉన్న కంపెనీలు సాధారణంగా తక్కువ రిస్క్గా పరిగణించబడుతున్నాయి. ప్రస్తుతం శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్, సుందరం హోమ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ వంటి సంస్థలు మంచి రేటింగ్లతో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందుతున్నాయి.
ముతూత్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రస్తుతం 8.95 శాతం వరకు వడ్డీ అందిస్తుండగా, మణిపాల్ హౌసింగ్ ఫైనాన్స్ 8.25 శాతం వరకు రాబడిని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. నెలవారీ, త్రైమాసిక, వార్షిక వడ్డీ చెల్లింపు ఎంపికలతో పాటు క్యుములేటివ్ డిపాజిట్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే కేవలం అధిక వడ్డీ కోసం పెట్టుబడి పెట్టడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ రుణ నాణ్యత, ఆర్థిక స్థిరత్వం, లిక్విడిటీ పరిస్థితులను పరిశీలించి, పెట్టుబడులను విభజించుకోవడం ద్వారా రిస్క్ను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి