
పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను మార్చుతున్నట్లు ప్రకటించింది. రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే వాణిజ్య కొనుగోలుదారులపై ఉన్న అన్ని ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. జూలై 1 నుండి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో చమురు కొరతను నివారించేందుకు కేంద్రం వాణిజ్య కొనుగోలుదారులకు పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. వాణిజ్య వాహనాలకు డీజిల్ అమ్మకాలను రోజుకు గరిష్టంగా 200 లీటర్లకు పరిమితం చేసింది. ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో ప్రభుత్వం ఈ ఆంక్షలను తొలగించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం, ముడి చమురు ధరలు తగ్గడం, హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో ఇంధన సరఫరా మెరుగుపడటంతో కేంద్రం ఆంక్షలను పూర్తిగా తొలగించింది. దీంతో జూలై 1వ తేదీ నుంచి పెట్రోల్ పంపుల వద్ద వాణిజ్య కొనుగోలుదారులకు ఇంధన రేషనింగ్ను పూర్తిగా తొలగించనుంది. చమురు సరఫరాలు పూర్తిగా పునరుద్ధరించబడటం, పరిస్థితి అదుపులోకి రావడంతో ఈ కఠినమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఆంక్షలను ఎత్తివేయడం వల్ల ట్రక్కులు, బస్సులు, భారీ పరిశ్రమలతో పాటు వాణిజ్య కొనుగోలుదారులు ఎలాంటి పరిమితులు లేకుండా పెట్రోల్ పంపుల నుండి తమకు కావలసినంత ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రవాణా ఖర్చులు భారీగా తగ్గడమే కాకుండా మార్కెట్లో నిత్యావసర వస్తువుల రవాణాను వేగవంతం అవుతుంది. దీనివల్ల సాధారణ వినియోగదారులకు ద్రవ్యోల్బణం నుండి కొంత ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రిటైల్ పెట్రోల్ పంపులు, హోల్సేల్ ఇంధన ధరల మధ్య ఉన్న గణనీయమైన వ్యత్యాసం వల్ల కేంద్రం ఆంక్షలు విధించింది. దేశంలోని మొత్తం ఇంధన మార్కెట్లో కేవలం డీజిల్ వాటానే సుమారు 40 శాతంగా ఉంది. యుద్ద సమయంలో పారిశ్రామిక, పెద్ద వాణిజ్య వినియోగదారులకు సరఫరా చేయబడిన హోల్సేల్ డీజిల్ ధర, సాధారణ పెట్రోల్ పంపుల వద్ద ఉన్న రిటైల్ ధర కంటే లీటరుకు సుమారు రూ.40 ఎక్కువగా ఉంది. ఈ గణనీయమైన వ్యత్యాసాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అన్ని ప్రధాన ట్రక్కింగ్ కంపెనీలు, పరిశ్రమలు డీజిల్ను పెద్దమొత్తంలో కొనడం మానేశాయి. తమ వాహనాలను నేరుగా సాధారణ పెట్రోల్ పంపుల వద్ద నిలపడం ప్రారంభించాయి. దీంతో సాధారణ వినియోగదారులకు ఇంధనాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఇటీవల పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. దీంతో ఆంక్షలు అవసరం లేదని భావించిన కేంద్రం.. ఈ మేరకు నిబంధనలను పూర్తిగా ఎత్తివేసింది.