
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుంటుండటంతో ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం పడుతోంది. స్టాక్ మార్కెట్లు కుల్పకూలుతుండగా.. రవాణాకు అంతరాయం కలుగుతోంది. దీని వల్ల పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశముందనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ద ప్రభావం పశ్చిమాసియా దేశాలపై కూడా పడింది. ఇరాన్, దుబాయ్, ఖతార్ వంటి దేశాలు ముడి చమురును ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాయి. భారత్ ఆయా దేశాల నుంచి చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఉద్రిక్త పరిస్థితుల వల్ల రవాణాకు ఆటంకం కలిగే అవకాశమంది. దీని వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చనే ప్రచారం గత కొద్ది రోజులుగా జోరుగా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఏప్రిల్ 2022 నుంచి స్థిరంగా కొనసాగుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్న సమయంలో కంపెనీలకు లాభాల కోసం ధరలను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉంటుంది. అయితే ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. అంతేకాకుండా త్వరలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం లాంటి ప్రధాన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనన్నాయి. ఇలాంటి తరుణంలో ధరలను పెంచితే కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశముంటుంది. ఈ కారణాలతో ధరలను పెంచకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నాయి. ఇరాన్, పశ్చిమాసియా దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ముడి చమురు ధరలు పెరుగుతున్న క్రమంలో అధికారులతో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమావేశమయ్యారు. ముడి చమురు, ఎల్పీజీ, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధర, నిల్వలపై చర్చించారు. ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ అధికారులతో కూడా ఆయన సమావేశమయ్యారు. అనంతరం పెట్రోలియం మంత్రిత్వశాఖ ఎక్స్లో కీలక ప్రకటన చేసింది. పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, సరసమైన ధరలకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. కాగా ముడి చమురు ధరలు పెరిగినా దాని ప్రభావం భారత్పై పడటానికి కొంత సమయం పట్టే అవకాశముంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో పెరిగే ఛాన్స్ లేదని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.