E20 Petrol: ఈ20 పెట్రోల్ వాడటం సేఫ్ కాదా..? కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పిన కేంద్రం.. ఊహాగానాలపై క్లారిటీ..

ఈ20 పెట్రోల్ గురించి ఇటీవల బాగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీని గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రకం పెట్రోల్ వాడటం వల్ల వాహనాలు దెబ్బతినే అవకాశముందని ప్రచారం సాగుతోంది. అలాగే మైలేజ్ కూాడా తగ్గుతుందనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.

E20 Petrol: ఈ20 పెట్రోల్ వాడటం సేఫ్ కాదా..? కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పిన కేంద్రం.. ఊహాగానాలపై క్లారిటీ..
E20 Petrol

Updated on: Jul 10, 2026 | 6:49 PM

ఈ20 పెట్రోల్ గురించి గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ గురించి వస్తున్న అన్ని ప్రచారాలకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇథనాల్ కొత్త ఇంధనం కాదని, హెన్రీ ఫోర్డ్ వంద సంవత్సరాల క్రితమే మోడల్ టిని ఇథనాల్‌తో నడిచేలా రూపొందించారని తెలిపింది. బ్రెజిల్, అమెరికా వంటి దేశాల్లో దశాబ్దాలుగా దీనిని ఉపయోగిస్తున్నారని, 2001లోనే భారత్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం ప్రారంభమైందని స్పష్టం చేసింది. 2004లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రకటించగా.. 2006లో E5 అనేక రాష్ట్రాలలో ప్రవేశపెట్టారని క్లారిటీ ఇచ్చింది. జనవరి 2013లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 5 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించాలనే లక్ష్యంతో కేంద్రం గెజిట్ కూడా విడుదల చేసిందని గుర్తు చేసింది. మే 2018లో జీవ ఇంధనాలపై జాతీయ విధానం ముడి పదార్థాల పరిధిని చెరకుకు మించి మొక్కజొన్న, మిగులు ధాన్యం వరకు విస్తరించిందని, ఇథనాల్ ఉత్పత్తిని నిజమైన ప్రభుత్వ సమగ్ర లక్ష్యంగా మార్చిందని పేర్కొంది.

మైలేజ్ తగ్గే అవకాశం ఉందా..?

2021లో 10 శాతం బ్లెండింగ్ సాధించడానికి భారత్‌కు ఏటా సుమారు 500 నుండి 600 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమైందని, కొత్త పెట్టుబడులతో ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో వార్షిక ఇథనాల్ లభ్యత 1,200 కోట్ల లీటర్లకు చేరుకుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. తగినంత సరఫరా అందుబాటులో ఉండటంతో 20 శాతం బ్లెండింగ్‌కు పురోగమించడం ఒక కీలక అడుగుగా మారిందంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇథనాల్ ప్లాంట్లు, నిల్వ, లాజిస్టిక్స్ కోసం సంవత్సరానికి దాదాపు రూ. 1 లక్ష కోట్లు ఆర్థిక సహాయం అందించాయని, ఇప్పుడు E10కి తిరిగి వెళ్లడం వల్ల ఈ పెట్టుబడి నిరుపయోగం అవుతుందని తెలిపింది. అలాగే రైతులు, పారిశ్రామికవేత్తలకు నష్టం కలుగుతుందని స్పష్టం చేసింది. E20 పెట్రోల్ విడుదల చేయకముందే ఇంజిన్ సామర్ధ్యం, ఇంధన వ్యవస్థలు, రబ్బరు భాగాలు, ఉద్గారాలు వంటి వాటి గురించి అనేక దశల్లో పరీక్షలు జరిగాయని, అనంతరం దీనిని ప్రవేశపెట్టామని తెలిపింది. ఈ20 పెట్రోల్ వల్ల మైలేజ్ 3 నుంచి 5 శాతం తగ్గవచ్చని పేర్కొంది.

ఈ20 పెట్రోల్ వల్ల నాలుగు ప్రయోజనాలు

“మారుతి సుజుకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2.84 కోట్ల కార్లకు సర్వీసింగ్ చేసింది. వాటిల్లో 1.5 కోట్లు E20 కోసం ఎన్నడూ ధృవీకరించబడని పాత వాహనాలు. వాటిలో E20కి సంబంధించిన నష్టం ఏదీ కనిపెట్టలేదు. E20 నిజంగా రబ్బరు హోసులు, ఫ్యూయల్ లైన్లు లేదా ఇంజిన్లను దెబ్బతీసి ఉంటే.. వారంటీ క్లెయిమ్‌లు, ఫిర్యాదుల ద్వారా వెలుగులోకి వచ్చి ఉండేది. పెట్రోల్‌లో కలిపే ప్రతి లీటరు ఇథనాల్ వల్ల నాలుగు ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ముడి చమురు దిగుమతి. తక్కువ విదేశీ మారక ద్రవ్యం ఖర్చు. భారతీయ రైతులకు అధిక ఆదాయం. పౌరులకు మరింత స్థిరమైన పెట్రోల్ ధర లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేసింది. ముడి చమురు దిగుమతులను తగ్గించింది. ఉద్గారాలను తగ్గించింది. రైతుల ఆదాయాలను పెంచింది. E20 అనేది శాస్త్రీయంగా ధృవీకరించబడ్డ ఇంధనం” అని కేంద్రం పేర్కొంది.

Follow Us