
సొంతిల్లు నిర్మించుకోవడం అనేది ప్రతీఒక్కరి కల. ఇందుకోసం చెమటొడ్చి సంపాదించుకున్న సొమ్మును కూడబెట్టుకుంటుంటారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకైతే సొంతిల్లు అనేది చాలా ఆర్ధిక భారంతో కూడుకున్న పని. దీంతో తమ దగ్గర ఉన్న డబ్బులు సరిపోక బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఈ డబ్బులో కొత్త ఇల్లు నిర్మించుకోవడం లేదా ఇంటిని కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఏదైనా కారణం చేత మీరు రుణాన్ని తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో బ్యాంకు మీ ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. అయితే ఇంట్లోనే వస్తువులను కూడా స్వాధీనం చేసుకునే ఘటనలు మనం చూస్తూ ఉంటాం. దీంతో బ్యాంకులో ఇంటితో పాటు ఇంట్లోని సమాన్లను కూడా జప్తు చేయవచ్చా..? దీనికి సమాధానం ఇప్పుడు చూద్దాం.
రూల్స్ ప్రకారం గడువు తేదీలోగా రుణం చెల్లించలేని పక్షంలో బ్యాంకులు నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు జారీ చేసి ఇంటిని స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ఇంట్లోని వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి హక్కు ఉండదు. ఇల్లు లేదా ఆస్తిని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. కానీ ఇంట్లోని సోఫాలు, బల్లలు, ఎల్ఈడీ టీవీలు, సీలింగ్ ఫ్యాన్లు, వంటసామాగ్రి, గ్యాస్ స్టవ్లు, విద్యుత్ ఉపకరణాలు, చెక్క మంచాలు, ఇతర గృహోపకరణాలు వంటి వస్తువులను తాకట్టు పెట్టరు. దీంతో ఆర్ధిక సంస్థలకు ఇంట్లోని వస్తువులను స్వాధీనం చేసుకునే హక్కు ఉండదని నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ బ్యాంకులు స్వాధీనం చేసుకుంటే ఖాతాదారులు బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ లేదా వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాతో పాటు నష్టానికి ఖాతాదారులకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
తాజాగా ఒక కేసులో రూ.3 లక్షల నష్టపరిహారంతో పాటు మానసిక వేధింపులకు రూ.25 వేలు, న్యాయ ఖర్చుల కోసం రూ.10 వేలు ఖాతాదారుడికి చెల్లించాలని హెచ్డీఎఫ్సీని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. బరోడాకు చెందిన నీరూ చౌహాన్ భర్త మనీష్ చౌహాన్ 2016లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుండి రూ.12.38 లక్షల హోం లోన్ తీసుకున్నారు. ఈ రుణంతో ఒక ఇల్లు కొనుగోలు చేశారు. అయితే ఆయన ఇంటి బీమా కూడా తీసుకున్నారు. చౌహాన్ 2019లో కాలేయ వ్యాధితో మరణించారు. ఆయన భార్య నీరూకు ఎలాంటి ఆదాయం లేకపోవడంతో ఈఎంఐ చెల్లించలేకపోయారు. 2023లో బ్యాంక్ స్వాధీనం చేసుకుని ఆమెను ఇంట్లోని ఆమె సామాన్లను కూడా తీసుకెళ్లనీయలేదు. 2024 జూలైలో ఆమె వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేసింది. దీంతో కోర్టు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా బ్యాంక్కు ఆదేశాలిచ్చింది.