
కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయం గల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అర్హతా ప్రమాణాల ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిర్దిష్ట కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఎప్పటినుంచో ఈ పథకం అమలు అవుతుండగా.. ఎంతోమంది లబ్ది పొందుతున్నారు. కోట్లాది మంది ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు కలిగి ఉన్నారు.
ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఈ కార్డు కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే మీరు కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పథకం నిబంధనల ప్రకారం 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ పథకం ప్రయోజనాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా పొందవచ్చు. మీ వయస్సు 70 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే అనేక షరతులను నెరవేర్చాల్సి ఉంటుంది. లేకపోతే మీ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటుంటే ఫారమ్ను సరిగ్గా నింపాలి. మీరు తప్పడు సమాచారం అందిస్తే.. భవిష్యత్తులో మీ కార్డు రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డులో మీరు ఇచ్చిన మీ పేరు, తండ్రి పేరు, కార్డు నంబర్ వంటి సమాచారం సరిపోలకపోతే కార్డు బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.
ఇర రేషన్ కార్డులో ఇచ్చిన అడ్రస్, ఆధార్ కార్డులో ఇచ్చిన అడ్రస్ ఒకేలా ఉండాలి. లేకపోతే కార్డు రద్దు అయ్యే అవకాశముంటుంది. ఇక మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయినా, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నా. మీ కుటుంబం బలహీన లేదా అసంఘటిత కార్మిక వర్గానికి చెందకపోతే ఈ పథకానికి అనర్హులు.. ఒకసారి దరఖాస్తు చేసుకునేముందు మీ అర్హతలను ఒకసారి పరిశీలించుకోండి. ఆ తర్వాతనే దరఖాస్తు చేసుకోండి.