
కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు, పెన్షన్ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ వర్గాల కోసం వివిధ స్కీమ్స్ అమలు చేస్తోంది. అందులో భాగంగా స్వయం ఉపాధి, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం అటల్ పింఛన్ యోజన పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఈ స్కీమ్లో ఇప్పటికే లక్షలాది మంది చేరారు. ఈ స్కీమ్లో చేరినవారు రిటైర్మెంట్ వయస్సు తర్వాత ప్రతీ నెలా కేంద్రం నుంచి పెన్షన్ పొందవచ్చు. ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద వయస్సు వచ్చాక నెలవారీ ఆదాయం ఉండదు. దీంతో అప్పుడు ఈ పెన్షన్ సొమ్ముతో మీ ఆర్దిక అవసరాలను తీర్చుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే అవకాశం ఈ పథకంలో ఉంది. ఈ స్కీమ్లో ఎలా చేరాలనేది ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచే పెన్షన్ పొందే పథకాలు అమలవుతున్నాయి. అయితే స్వయం ఉపాధి, ఇతర రంగాల్లో పనిచేసేవారికి కూడా పెన్షన్ ప్రయోజనాలు అందించేందుకు కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరినవారు 60 ఏళ్లు వచ్చేంతవరకు తక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్లు దాటాక మీరు ప్రతీ నెలా రూ.5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. ఎంత ప్రీమియం చెల్లించగలరు.. ఎంత పెన్షన్ పొందాలనుకుంటున్నారనేది మీరు ముందు నిర్ణయించుకోవచ్చు.
భారత పౌరులై అయి ఉండాలి. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. సమీపంలోని పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు వెళ్లి ఇందులో చేరవచ్చు. కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా కూడా నమోదు కావొచ్చు. గత ఆర్ధిక సంవత్సరం 2025-26లో 1.35 కోట్ల మంది ఈ స్కీమ్లో చేరగా.. 2026 మే నాటికి ఏకంగా 9.10 కోట్ల మంది ఇందులో చేరినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సువారు ఎక్కువమంది ఇందులో చేరారు. గత 10 పదేళ్లల్లో ఈ వయస్సువారే ఎక్కుకవమంది ఈ పథకంలో చేరుతున్నారు. 2015-16లో ఈ పథకం ప్రారంభమవ్వగా.. తొలి ఏడాదిలో 7.23 లక్షల మంది చేరారు. ఆ తర్వాత 2024-25లో 54.47 లక్షల మందికి చేరింది. ఇప్పటివరకు చందాదారుల నుంచి రూ.54 వేల కోట్లు అందాయి. ఏపీలో 40 లక్షలు, తెలంగాణలో 28 లక్షల మంది ఈ పథకంలో చేరారు. ఈ పథకంలో వయస్సు తక్కువగా ఉన్నప్పుడు చేరడం వల్ల తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుది. అదే వయస్సు పెరిగే కొద్ది చేరితే ప్రీమియం పెరుగుతుంది.