
భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ముందు, లగ్జరీ హోటల్ గదుల ధరలు అకస్మాత్తుగా విపరీతంగా పెరిగాయి. ఈ పెరుగుదల విదేశీ అతిథులను ఆశ్చర్యపరచడమే కాకుండా, ఆగ్రహానికి గురిచేసింది. ఇటువంటి ధరలు భారతదేశ ప్రపంచ ప్రతిష్టను దెబ్బతీస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఢిల్లీ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, హై-ప్రొఫైల్ నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీనికి కారణం వచ్చే వారం జరగనున్న ‘AI ఇంపాక్ట్ సమ్మిట్’. ఈ సమ్మిట్ ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఉన్న “భారత్ మండపం” లో ఘనంగా జరగబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచంలోనే టాప్ టెక్ సీఈఓలు వస్తున్నారు. ముఖ్యంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ (ChatGPT) సీఈఓ శామ్ ఆల్ట్మన్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ వాంగ్ వంటి దిగ్గజాలు హాజరవుతున్నారు.
ఈ సమ్మిట్లో పాల్గొంటారనే వార్త ఢిల్లీ హోటల్ ధరలను ఆకాశానికి చేరుకున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే, న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లోని ‘గార్డెన్ లగ్జరీ సూట్’ ఒక రాత్రి అద్దె పన్నులతో సహా దాదాపు రూ. 32 లక్షలకు చేరుకుంది. ఆసక్తికరంగా, అదే గది ప్రేమికుల దినోత్సవం రోజున అంటే ఫిబ్రవరి 14న కేవలం రూ. 2 లక్షలకు అందుబాటులో ఉంది. అంటే సమ్మిట్ సమయంలో ధరలలో 1500% ఆశ్చర్యకరమైన పెరుగుదల ఉంది. దీని వల్ల హోటల్ ధరలు సామాన్యులే కాదు, సంపన్నులు కూడా ఆశ్చర్యపోయేలా పెరిగిపోయాయి.
రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలో గది దొరకడం ఇప్పుడు దాదాపు అసాధ్యం. ది లీలా ప్యాలెస్లోని మహారాజా సూట్లు రూ. 6.9 లక్షలకు, ది ఒబెరాయ్లోని లగ్జరీ సూట్లు రాత్రికి రూ. 5.5 లక్షలకు బుక్ అవుతున్నాయి. ఇక్సిగో ప్రకారం, ఢిల్లీ కోసం హోటల్ కోసం సెర్చ్ చేసే వారు ఆరు రెట్లు పెరిగాు. సెంట్రల్ ఢిల్లీలోని చాలా ఫైవ్ స్టార్ హోటళ్లలో ఖాళీలు ఉన్నప్పటికీ, ప్రారంభ ధరలు రూ. 70,000 మరియు రూ. 1 లక్ష మధ్య ఉన్నాయి. ది లలిత్, జేపీ వసంత్ కాంటినెంటల్ వంటి హోటళ్లు 95% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. కొన్ని గదులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇదిలావుంటే, సాధారణ గదుల ధరలు కూడా భారీగా పెరిగాయి. మామూలు రోజుల్లో రూ. 20,000 నుండి రూ. 40,000 ఉండే గదుల ధరలు ఇప్పుడు అమాంతం పెరిగి రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల వరకు పలుకుతున్నాయి. అంతేకాదు నో వేకెన్సీ బోర్డులు సైతం దర్శనమిస్తున్నాయి. డబ్బులు ఎంత పెట్టినా సరే, ఫిబ్రవరి 16-20 తేదీల్లో ఢిల్లీలోని తాజ్, ఒబెరాయ్, లీలా, ఐటీసీ మౌర్య వంటి ప్రముఖ హోటల్స్ అన్నీ ఇప్పటికే పూర్తిగా బుక్ అయిపోయాయన్న సమాధానం వస్తోంది.
AI సమ్మిట్ ప్రభావం ఢిల్లీకే పరిమితం కాలేదు. నోయిడాలోని హోటళ్లు కూడా నిండిపోతున్నాయి, ఎందుకంటే దాని డేటా సెంటర్లు, IT పార్కుల కారణంగా టెక్ ప్రతినిధులు అక్కడే ఉండటానికి ఇష్టపడతారు. అలాగే శిఖరాగ్ర సమావేశం తర్వాత, చాలా మంది ప్రతినిధులు జిమ్ కార్బెట్, ముక్తేశ్వర్ వంటి హిల్ స్టేషన్లకు పర్యటనలను బుక్ చేసుకుంటున్నారు. భారతదేశంలో “వ్యాపారం + విశ్రాంతి” ధోరణి వేగంగా పెరుగుతోందని ఇది చూపిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా పర్యాటక పరిశ్రమకు చాలా సానుకూల సంకేతమంటున్నారు నిపుణులు.
ఇక ఇంతమంది వీఐపీలు వస్తుండటంతో, గతంలో జరిగిన G20 సమ్మిట్ లాగానే ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 4000 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉండబోతున్నారు. విదేశీ అతిథుల కోసం ఢిల్లీని అందంగా ముస్తాబు చేస్తున్నారు. రోడ్ల పక్కన ఆక్రమణలు తొలగించడం, పాత G20 పోస్టర్ల స్థానంలో AI సమ్మిట్ బ్యానర్లు పెట్టడం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..