తమిళనాడులో సంచలన సృష్టించిన తండ్రీకొడుకులు మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పోలీస్ కస్టడీలో తండ్రీకొడుకులు హింసించడం వల్లే చనిపోయారన్న ఆరోపణలపై ఎన్హెచ్ఆర్సీ విచారణ జరుపుతోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి, తూత్తుకుడి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితుల పంచనామా, పోస్ట్మార్టం పరీక్షల నివేదికలు, వైద్య చికిత్సల రికార్డులు, మెజిస్టీరియల్ ఎంక్వైరీ నివేదికలు, హెల్త్ స్క్రీనింగ్ రిపోర్టులు సహా అన్ని వివరాలను సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి, తూత్తుకూడి జిల్లా పోలీసు సూపరింటెండెంట్కు నోటీసులు జారీ చేసింది.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి సబ్జైలులో జయరాజ్, ఫెనిక్స్ అనే తండ్రీకొడుకు ఈనెల 22 తేదీ రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. పోలీసుల చిత్రహింసల వల్లే వారు చని పోయినట్టు ఆరోపణలు రావటంతో ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అటు, దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతోంది. ఆ కోర్టు ఉత్తర్వు మేరకు ఇద్దరు మేజిస్ట్రేట్లు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఇక, తమిళనాడు ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది. తాజాగా ఎన్హెచ్ఆర్సీ తమిళనాడు పోలీసులకు నోటీసులు జారీ చేసింది.