Minister KTR Inaugurated Steel Flyover Work : భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు నగరంలో పలు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. లాక్డౌన్ సమయంలో ప్రపంచం మొత్తం ఆగిపోతే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి పనుల్లో దూసుకుపోతోంది. మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ(GHMC)లో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తి చేస్తున్నారు.
తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్డౌన్ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కె.తారాక రామా రావు అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి కేటీఆర్ భూమిపూజ నిర్వహించారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు వంతెన నిర్మాణానికి ఇందిరాపార్కు వద్ద శంకుస్థాపన చేశారు. ఎస్సార్డీపీ(SRDP)లో భాగంగా రెండు వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు.
రూ.350 కోట్లతో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి, రెండో దశలో రూ.76 కోట్లతో రాంనగర్ నుంచి బాగ్లింగపల్లి వరకు మూడు లేన్ల వంతెన నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రూ.6 వేల కోట్లతో ఎస్సార్డీపీ పనులు చేస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైరదాబాద్లో పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తిచేస్తామని చెప్పారు. రూ.5 వేల కోట్లతో స్కైవేల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.