
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉదృతి కొనసాగుతున్నది. వరుసగా ఆరో రోజు కూడా తొమ్మిది వేలకు పైగా కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,983 పాజిటివ్ కేసులు నమోదు కాగా 206 మంది మరణించారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,56,611కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,24,095 మంది కోలుకోగా, దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ మహమ్మారికి 7,135 మంది బలయ్యారు.
చైనాను క్రాస్ చేసిన మహారాష్ట్ర…
కరోనాతో అతలాకుతలం అవుతున్న మహారాష్ట్ర తాజా కేసులతో చైనాలో నమోదైన కేసుల సంఖ్యను దాటేసింది. మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 3007 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 85,975 కరోనా పాజిటివ్ కేసులు బయటపడగా… వీరిలో ఇప్పటివరకు 3,060 మంది మృత్యువాతపడ్డారు. చైనాలో ఇప్పటివరకు 83,036 కేసులు నమోదయ్యాయి. దీంతో చైనాకంటే ఎక్కువ కరోనా కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదవడం విశేషం. 31,667 కరోనా కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, 27,654 కేసులతో ఢిల్లీ, 20,700 పాజిటివ్ కేసులతో గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక కరోనా మరణాల్లో దేశంలో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. కేసుల సంఖ్య 20వేలు దాటగా వీరిలో ఇప్పటి వరకు 1249మంది చనిపోయారు.