నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇప్పటివరకు 2,90,000 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో అధికారులు 14 గేట్లు ఎత్తి 2,40,000 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్కి విడుదల చేశారు. శనివారం పులిచింతల ప్రాజెక్ట్ని సందర్శించిన కలెక్టర్ ఇంతియాజ్.. వరద పరిస్థితిని సమీక్షించారు.
వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంత తహశీల్దార్లకు పలు సూచనలు చేశారు. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల, రావిరాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం విప్, స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మరో రెండు రోజుల్లో మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉన్నదున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నీటి పరిస్థితిని బట్టి జిల్లాకు వరద నీరు మరింతగా రానుందని తెలిపారు. వర్షాలు కూడా కురుస్తుండటంతో వరదనీటికి ఈ నీరు కూడా తోడయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనివల్ల కృష్ణానదికి ఉధృతంగా వరద వచ్చే ప్రమాదముందని చెప్పారు.