దిల్లీ: గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర అదే ఫ్లోలో కొనసాగుతుంది. శనివారం రూ.310 తగ్గడంతో బంగారం ధర రూ.34వేల మార్క్ దిగువకు చేరింది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.33,770కి చేరింది. డాలరు విలువ పది వారాల టాప్కి చేరటం, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ మందగించడం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధర దిగొస్తున్నట్లు ట్రేడర్లు చెబుతున్నారు.
అటు అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గింది. న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర 1.52శాతం తగ్గడంతో ఔన్సు 1,293.90 డాలర్లు పలికింది. మరోవైపు వెండి పసిడి బాటలోనే పయనించి రూ.40వేల మార్క్ దిగువకు చేరింది. రూ.730 తగ్గడంతో కిలో వెండి రూ.39,950కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధర భారీగా తగ్గింది. గత రెండు రోజుల్లో బంగారం ధర రూ.570 తగ్గింది.