బోట్లో ఉన్నది 73 మంది కాదు..77 మంది..మంత్రి క్లారిటీ!

|

Sep 20, 2019 | 3:29 PM

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలోని బోటు ప్రమాద ఘటనలో ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని  మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. బోటులో తొలుత 73 మంది ఉన్నారని భావించినప్పటికీ, బాధితుల సమాచారం ప్రకారం 77 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనలో 26 మంది సురక్షితంగా బయటపడగా.. ఇప్పటి వరకు 35 మృతదేహాలను గుర్తించినట్లు మంత్రి వివరించారు. ఇవాళ ఉదయం కచ్చులూరు సమీపంలో బయటపడిన మహిళ మృతదేహాన్ని విశాఖకు చెందిన అరుణగా […]

బోట్లో ఉన్నది 73 మంది కాదు..77 మంది..మంత్రి క్లారిటీ!
Follow us on

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలోని బోటు ప్రమాద ఘటనలో ఇంకా 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని  మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. బోటులో తొలుత 73 మంది ఉన్నారని భావించినప్పటికీ, బాధితుల సమాచారం ప్రకారం 77 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనలో 26 మంది సురక్షితంగా బయటపడగా.. ఇప్పటి వరకు 35 మృతదేహాలను గుర్తించినట్లు మంత్రి వివరించారు. ఇవాళ ఉదయం కచ్చులూరు సమీపంలో బయటపడిన మహిళ మృతదేహాన్ని విశాఖకు చెందిన అరుణగా గుర్తించామన్నారు. ఆచూకీ తెలియాల్సిన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 9 మందికాగా.. మరో ఏడుగురు తెలంగాణ వారని మంత్రి తెలిపారు.

గోదావరిలో మునిగిన బోటు 250 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారని, దాని కిందే మిగిలిన మృతదేహాలు ఉండొచ్చని మంత్రి అంచనా వేశారు. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో బోటును బయటకు తీయడం కష్టంగా మారిందన్నారు. బోటులోనే మిగిలిన మృతదేహాలు ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. బోటు ప్రమాదం ఘటనపై రెండు విచారణలు కొనసాగుతున్నాయన్నారు. బోటు ప్రమాదం సమయంలో 27 మందిని రక్షించిన గిరిజనులను మంత్రి అభినందించారు.

ఈనెల 15న పాపికొండల పర్యటనకు వెళ్లిన బోటు గోదావరిలో మునిగిపోయింది. కచ్చులూరు వద్ద పడవ నదిలో బోల్తా పడింది. ఆ సమయంలో 27 మంది ప్రయాణికులు ఎలాగో ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలిన మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఆరు రోజులుగా సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే,బోటుకు అనుమతి లేదనే వాదన కూడా ఉంది. పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ ఒత్తిడి వల్లే బోటును వదిలిపెట్టారని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తుంది.