పవన్‌కల్యాణ్‌కు చిరంజీవి షాక్.. జగన్ని పొగిడేసారుగా..!

| Edited By: Srinu

Dec 12, 2019 | 3:41 PM

ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ విధానాలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ కాకినాడలో దీక్ష చేస్తుంటే ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ పవన్ కల్యాణ్ కాకినాడలో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఒకరోజు నిరాహార దీక్ష ఈ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఒకవైపు పవన్ కల్యాణ్… ఆయన రెండో సోదరుడు నాగబాబు కలిసి కాకినాడ దీక్షా […]

పవన్‌కల్యాణ్‌కు చిరంజీవి షాక్.. జగన్ని పొగిడేసారుగా..!
Follow us on

ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ విధానాలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ కాకినాడలో దీక్ష చేస్తుంటే ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. రైతులకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ పవన్ కల్యాణ్ కాకినాడలో దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఒకరోజు నిరాహార దీక్ష ఈ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.

ఒకవైపు పవన్ కల్యాణ్… ఆయన రెండో సోదరుడు నాగబాబు కలిసి కాకినాడ దీక్షా శిబిరంలో కూర్చున్న సమయంలోనే చిరంజీవి వారిద్దరికీ షాకిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. అయితే ఆయన ప్రశంసలు జగన్ వ్యవసాయ విధానంపై కాదు. బుధవారం సాయంత్రం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో క్రిమినల్ చట్టంలో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని చిరంజీవి ప్రశంసించారు.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఇతర హింసలను అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం చక్కని నిర్ణయం తీసుకుందన్నది చిరంజీవి ప్రశంసల సారాంశం. నిజానికి మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు చట్టంలో మార్పులు తేవడాన్ని సమాజంలో అన్ని వర్గాలు అభినందిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ శివారుల్లో జరిగిన దిశ సామూహిక అత్యాచారం, దారుణ హత్య ఉదంతం అందరినీ కలచి వేసింది. నేరస్థులను శిక్షించిన సైబరాబాద్ పోలీసులను పలువురు అభినందించారు.

అయితే, చట్టంలో మార్పులు, వేగంగా విచారణ అనే అంశాలు అందరిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే జగన్ కేబినెట్ క్రిమినల్ చట్టంలో మార్పులు తేవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అందరితో పాటు మెగాస్టార్ కూడా స్పందించారు. ముఖ్యమంత్రిని అభినందించారు. ఇంత వరకు బాగానే వున్నా.. సోదరులు పవన్ కల్యాణ్, నాగబాబులిద్దరు జగన్ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించిన నేపథ్యంలో చిరంజీవి ముఖ్యమంత్రిని అభినందించడం వారిద్దరికి కాస్త ఎంబరాస్సింగేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.