హైదరాబాద్: అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం అవంతి మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఒక టీడీపీ ఎమ్మెల్యే అవినీతిపై పిఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు అందిందని అన్నారు.
దీనిపై పీఎంఓ కార్యాలయం విచారణ కూడా జరిపిందని చెప్పారు. అయితే అప్పటి నుంచే మోడీకి చంద్రబాబు వ్యతిరేకమయ్యారని ఆరోపించారు. తన ఎమ్మెల్యే అవినీతి వ్యవహారం బయటపడినందునే చంద్రబాబు తీరు మారిందని చెప్పారు. చంద్రబాబు ఏది చెబితే ప్రజలు అది వినాలంటే కుదరదని, ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చే హామీలను ప్రజలు నమ్మరని అన్నారు.
జగన్కు ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే అందరికీ న్యాయం చేసి చూపిస్తారని అవంతి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడారాజీనామా చేయాల్సిందని అవంతి అన్నారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు తన మాట వినలేదని విమర్వించారు. టీడీపీ అవినీతి కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని అవంతి అన్నారు.