
అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చట్టబద్ధత కోసం తీర్మానం చేసినప్పుడు.. మళ్లీ సవరణ చేయలేమా?.. అదే అసెంబ్లీలో తీర్మానంచేసి మార్చుకోలేమా?’’.. అంటూ జగన్ పేర్కొన్నారు. చట్ట సవరణ చేసుకోవచ్చనే విషయం చిన్న పిల్లాడికి తెలుసు.. కానీ, ప్రజల మభ్యపెట్టడానికి చంద్రబాబు డ్రామాలాడుతున్నారంటూ విమర్శించారు. దోపిడీ నుంచి డైవర్ట్ చేయడానికి ఈ డ్రామాలన్నీ అంటూ పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టం చేయగలదు, చట్టాన్ని మార్చగలదన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వైసీపీ వ్యతిరేకం కాదని జగన్ పేర్కొన్నారు. అమరావతికే కాదు.. ఏ ప్రాంతానికీ మేం వ్యతిరేకం కాదు.. అన్ని ప్రాంతాలను వైసీపీ సమానంగా చూస్తుందని జగన్ వివరించారు. అమరావతి ప్రాజెక్ట్..దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని జగన్ తెలిపారు. అమరావతిలో ఆర్గనైజ్డ్గా అవినీతి, స్కామ్ జరుగుతోందని.. అతిపెద్ద అవినీతికి అమరావతిని రాజధానిగా చేశారని ఆరోపించారు.
ఏపీ రాజధానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్.. రాజధానికి ప్లాన్ బీ అంటూ మరో సరికొత్త ప్రతిపాదన చేశారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయాలని జగన్ అన్నారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కేపిటల్గా డిక్లేర్ చేయండి.. 110 కిలోమీటర్ల మేర రాజధాని ప్రాంతంగా ప్రకటించండి.. అంటూ సూచించారు. మచిలీపట్నం నుంచి MA.. విజయవాడ నుంచి VI.. గుంటూరు నుంచి GUN తీసుకోండి.. కొత్త రాజధానికి ‘మావిగన్ – MAVIGUN’ అని పేరు పెట్టండి.. అంటూ జగన్ సూచించారు. రూ.2లక్షల కోట్లలో 10శాతం ఖర్చుచేస్తే చాలు డెవలప్ అవుతుందని.. చెన్నై, ముంబైలాగా పోర్ట్ సిటీగా రాజధాని ఉంటుందంటూ జగన్ వివరించారు.