వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు‌ను అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. కారణమేంటంటే..

MP Raghu RamaKrishna Raju: గత కొంతకాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై వరుస విమర్శలు చేస్తున్న ఆ పార్టీ..

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు‌ను అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. కారణమేంటంటే..
Raghu Rama Krishnam Raju

Updated on: May 14, 2021 | 6:29 PM

MP Raghu RamaKrishna Raju: గత కొంతకాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై వరుస విమర్శలు చేస్తున్న ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజును ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, రఘురామ కృష్ణ రాజు ఇంట్లోకి సీఐడీ అధికారులు రాగానే.. సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు. రఘురామను అరెస్ట్ చేయకుండా సీఆర్పీఎఫ్ జవాన్లు ఆయనను కవర్ చేశారు. దాంతో ఏపీ సీఐడీ అధికారులకు, రఘురామకు మధ్య గంటపాటు తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. చివరికి సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్ పైనా తీవ్ర వ్యాఖ్యలతో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ ఆయనపై వైసీపీ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఆయన అరెస్ట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగదిన ఏపీ సీఐడీ అధికారులు.. రఘురామను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రఘురామకృష్ణ రాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేయడానికి ముందు సెక్షన్ 50 కింద రఘురామకృష్ణ కుటుంబ సభ్యులకు సీఐడీ అధికారులు నోటీసులు అందించారు. అయితే, ఆ నోటీసులను తీసుకునేందుకు వారి తిరస్కరించినట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు. కాగా, నేడు రఘురామ కృష్ణరాజు పుట్టినరోజు. ఇవాళే ఆయనను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇదిలాఉంటే.. ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై ఆయన తనయుడు భరత్ స్పందించారు. వారెంట్ లేకుండా తన తండ్రిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. అరెస్ట్ కు కారణాలు చూపలేదని, తాము అడిగితే కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు సమాధానమిచ్చారని భరత్ వెల్లడించారు. 30మంది పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారని ఆరోపించారు. ‘‘మా నాన్నను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు? అని ప్రశ్నించారు. తన తండ్రికి ఆరోగ్యం కూడా బాగాలేదని భరత్ వాపోయారు. ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది మూడు నెలల కిందటేనని వెల్లడించారు. కనీసం న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు.

Also read:

Viral: డేంజరస్ డెత్ రిహార్సల్ చేసిన యువతి.. శవపేటికలో మూడు గంటల పాటు.. చివరికి ఏమైందంటే..

Corona Positive: విజయనగరంలో విషాదం.. కరోనా పాజిటివ్ వచ్చిందని ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తులు..

Loading...
Unable to load recommendations.
Follow Us