Andhra Pradesh: హామీని నెరవేర్చి ఆ గ్రామ ప్రజలకు దేవుడైన ఎమ్మెల్యే .. 50 ఏళ్ల కలను నెరవేర్చిన జోగారావుకు ఘన సన్మానం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఎమ్మెల్యేను పల్లకిలో ఊరేగించారు ప్రజలు. దశాబ్దాల సమస్యను పరిష్కరించటంతో ఘనంగా సన్మానించారు. ఇంతకీ.. ఎవరా ఎమ్మెల్యే?.. ప్రజలకు ఆయనేం చేశారు?.. తెలుసుకుందాం.. 

Andhra Pradesh: హామీని నెరవేర్చి ఆ గ్రామ ప్రజలకు దేవుడైన ఎమ్మెల్యే .. 50 ఏళ్ల కలను నెరవేర్చిన జోగారావుకు ఘన సన్మానం
Mla Ki Sanmanam

Updated on: May 27, 2023 | 7:25 AM

ఎవరికైనా ఏదైనా మంచి చేస్తే.. ఆ మంచిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. వారిని గుండెల్లో పెట్టుకుంటారు. అది దోస్తులైనా.. చుట్టాలైనా.. రాజకీయ నేతలైనా.. మంచి చేసినవారిని.. మహనీయులు మాదిరిగానే ట్రీట్‌ చేస్తారు. ఇలాంటి పరిస్థితులు రాజకీయాల్లో బాగా దర్శనమిస్తుంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు హామీలిచ్చి.. వాటిని నెరవేర్చితే చాలు.. వారిని ఆకాశానికెత్తేస్తారు ప్రజలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి దేవుడిగా మారారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో మంచి చేసిన ఓ ఎమ్మెల్యేను ఆకాశానికెత్తేశారు ప్రజలు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నూకలవాడ గ్రామస్తుల చిరకాల వాంఛ నెరవేర్చారు. నిజానికి.. గత ఐదు దశాబ్ధాలుగా ఆ గ్రామానికి రోడ్డు లేదు. చిన్నపాటి అవసరానికి కూడా గ్రామం దాటాలంటే ప్రజలు అష్టకష్టాలు పడేవారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ నేతలు ప్రచారానికి వెళ్ళడం.. రోడ్డు వేయిస్తామని హామీ ఇవ్వడం పరిపాటిగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అలజంగి జోగారావు కూడా రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. కానీ.. ఎన్నికల్లో గెలిచాక అందరిలా ముఖం చాటేయలేదు. సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టి.. నూకలవాడకు రోడ్డు ఏర్పాటు చేశారు.

వంతర- వంగర లింక్ రోడ్డు నుండి కోటి 55 లక్షల ప్రత్యేక నిధులతో సుమారు మూడు కిలోమీటర్ల మేర నూకలవాడకు తారు రోడ్డు వేయించారు. రోడ్డు వేసే క్రమంలో స్థానికంగా సమస్యలు ఎదురైనా అధిగమించి రోడ్డు పూర్తి చేసి హామీ నిలబెట్టుకున్నారు. సుమారు 500 కుటుంబాలు నివాసముంటున్న నూకలవాడ దశాబ్దాల కల నెరవేర్చడంతో ఎమ్మెల్యే జోగారావును ఘనంగా సన్మానించారు గ్రామస్తులు. గ్రామానికి ఆహ్వానించి మేళతాళాల మధ్య.. సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికి పల్లకిలో ఊరేగించారు. దారి పొడవునా పూల వర్షం కురిపించి కృతజ్ఞత చాటుకున్నారు. ఇక.. నూకలవాడ ప్రజల సన్మానోత్సవంపై ఆనందం వ్యక్తం చేశారు జోగారావు. నూకలవాడ ప్రజల ప్రేమతో మరింత భాధ్యత పెరిగిందన్నారు ఎమ్మెల్యే జోగారావు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us