దాంపత్యానికి ఉన్న బలం ఇదే.. భర్త గుండెలపై తలపెట్టి ఏడుస్తూ..

| Edited By: Srikar T

Jun 21, 2024 | 9:24 PM

విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంగర మండలం కొప్పరవలసలో మరణంలోనూ భార్య భర్తల బంధం వీడలేదు. ఈ గ్రామంలో బొద్దూరు శ్రీరాములు, చిన్నతల్లి అనే ఇద్దరు రైతు కుటుంబానికి చెందిన భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. అరవై సంవత్సరాలు వయస్సు ఉన్న ఈ వృద్ద దంపతులు ఒక అబ్బాయి, ఒక అమ్మాయికి వివాహం చేయగా మరొక అబ్బాయికి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. ముగ్గురికి పెళ్లిళ్లు చేస్తే బాధ్యతలు తీరిపోతాయనుకున్నారు.

దాంపత్యానికి ఉన్న బలం ఇదే.. భర్త గుండెలపై తలపెట్టి ఏడుస్తూ..
Vijayanagaram
Follow us on

విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంగర మండలం కొప్పరవలసలో మరణంలోనూ భార్య భర్తల బంధం వీడలేదు. ఈ గ్రామంలో బొద్దూరు శ్రీరాములు, చిన్నతల్లి అనే ఇద్దరు రైతు కుటుంబానికి చెందిన భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. అరవై సంవత్సరాలు వయస్సు ఉన్న ఈ వృద్ద దంపతులు ఒక అబ్బాయి, ఒక అమ్మాయికి వివాహం చేయగా మరొక అబ్బాయికి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. ముగ్గురికి పెళ్లిళ్లు చేస్తే బాధ్యతలు తీరిపోతాయనుకున్నారు. ఇంతలో శ్రీరాములు అనారోగ్యం పాలయ్యాడు. సుమారు నెల రోజుల పాటు అనారోగ్యంతో నరకం అనుభవించాడు. కొన్ని రోజులు స్థానికంగా వైద్య చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజిహెచ్‎కు తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ కూడా ప్రయోజనం లేకపోగా ఆరోగ్యం మరింత క్షీణించి చివరికి చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచాడు శ్రీరాములు.దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ శ్రీరాములు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు కుటుంబసభ్యులు. శ్రీరాములు మృతదేహం ఇంటికి వచ్చేవరకు శ్రీరాములు చనిపోయాడన్న విషయం భార్య చిన్నతల్లికి తెలియనీయలేదు బంధువులు. హాస్పటల్‎లో ట్రీట్మెంట్ అవుతుంది.. త్వరలో ఇంటికి తీసుకువస్తాం అని చిన్నతల్లికి చెప్పుకొస్తున్నారు తమ ముగ్గురు పిల్లలు.

అది నిజమే అని నమ్మిన చిన్నతల్లికి సడెన్‎గా ఇంటికి వచ్చిన శ్రీరాములు మృతదేహం చూసి తల్లడిల్లిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే తన భర్త మృతి తట్టుకోలేకపోయింది. గుండెలవిసేలా రోధించింది. పెద్దపెద్దగా కేకలు వేస్తూ ఆర్తనాదాలు పెట్టింది. చిన్నతల్లి ఏడుపు ఆపడం ఎవరి వల్ల కాలేదు. చిన్నతల్లి రాత్రంతా ఏడుస్తూనే గడిపింది. తన భర్త లేని జీవితం తనకు ఎందుకని పదేపదే అంటూ విలపించింది. అలా ఆపకుండా ఏడుస్తూనే భర్త గుండెలపై తలపెట్టి ఒక్కసారిగా భార్య కూడా ప్రాణాలు విడిచింది. పెద్దపెద్దగా ఏడుస్తున్న చిన్నతల్లి గొంతు అకస్మాత్తుగా మూగబోవడంతో పాటు కదలికలు కూడా ఆగిపోయాయి. దీంతో అక్కడే ఉన్న బంధువులంతా ఒక్కసారిగా దగ్గరికి వచ్చి చిన్నతల్లిని గమనించారు. అంతే భర్త గుండెలపై తలపెట్టి భార్య కూడా మరణించడం గమనించారు. ఆ ఘటన చూసి అందరూ షాక్ అయ్యారు. తల్లితండ్రులిద్దరూ ఒకేసారి మరణించడంతో వారి ముగ్గురు పిల్లలు పడిన వేదన అందరినీ కలిచి వేసింది. తర్వాత భార్యభర్తల మృతదేహాలను స్మశాన వాటికకు తరలించి ప్రక్కప్రక్కనే చితి ఉంచి ఇద్దరినీ ఒకేసారి దహనం చేశారు. భర్త మృతితో చనిపోయిన భార్య ఘటన జిల్లాలో తీవ్ర విషాదంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..