
సాధారణంగా పెళ్లి పత్రికలో ఏముంటాయి.. వరుడు, వధువు పేర్లు, విద్యార్హతలు, ముహూర్తం సమయం, పెళ్లి ఎక్కడ, విందు ఈ వివరాలు ఉంటాయి. కానీ, ఓ పెద్దాయన తన కొడుకు పెళ్లి ఆహ్వాన పత్రిక వెరైటీగా చేయించాడు. ఇటీవల సైబర్ మోసాలు పెరిగిపోవడంతో.. తన కొడుకు పెళ్లికి వచ్చే బంధువులు స్నేహితులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ… ఎలాంటి సైబర్ మోసాలు జరుగుతాయో పెళ్లి పత్రికలో ముద్రించాడు. అనంతపురం జిల్లా డీ. హీరేహాల్ మండలానికి చెందిన నాగళ్లు రాజా.. తన కుమారుడి వివాహ పత్రిక ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు. పెళ్లి పత్రికలో వరుడు, వధువు పేర్లు… సుముహూర్తం… విందు సమయం లాంటి వివరాలతో పాటు భిన్నంగా ఆలోచించారు. సైబర్ నేరాలపై కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులకు అవగాహన కల్పించాలని తన కొడుకు పెళ్లి పత్రికను డిజైన్ చేయించారు.
ప్రస్తుత రోజుల్లో ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకంగా పలు రకాల సైబర్ మోసాల గురించి.. పెళ్ళికొడుకు తండ్రి నాగళ్ళు రాజా పెళ్లి పత్రికలో డిజిటల్ అరెస్ట్, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్, ఫేక్ లోన్ యాప్స్, కొరియర్ ఫ్రాడ్స్ లాంటి సైబర్ మోసాలు గురించి వివరిస్తూ పెళ్లి పత్రికలు బంధుమిత్రులు స్నేహితులకు అందించారు. దాదాపు 5,000 మందికి ఈ పెళ్లి పత్రిక ద్వారా అవగాహన కల్పించాలని పెళ్లి పత్రికలను ముద్రించి డిస్ట్రిబ్యూట్ చేశారు. పెళ్లి పత్రికను కేవలం ఆహ్వానికే పరిమితం చేయకుండా అవగాహన ద్వారా ఆలోచింపజేయాలని.. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తపడేలా పెళ్లి కుమారుడు తండ్రి నాగళ్ళు రాజా చేసిన పనిని రాయదుర్గం పోలీసులు కూడా అభినందిస్తున్నారు. మంచి ఐడియా కదా..!
వీడియో చూడండి..