
విజయనగరం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం విఫలమైందని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువకుడి ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరుసటి రోజు ఉదయం ఈ విషయం బయటకు తెలియడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన పి.చంద్రశేఖర్ (23) విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం చెన్నైలో ఉంటున్నారు. కుమార్తెకు ఇప్పటికే వివాహం జరగగా, చంద్రశేఖర్కు వివాహం జరగాల్సి ఉంది. ఆగస్టు నెల 12వ తేదీన చంద్రశేఖర్ తన స్వగ్రామమైన పారాదికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఈ విషయం బయటకు తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడి మొబైల్ ఫోన్ను పరిశీలించడంతో పాటు అందులోని కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ను తనిఖీ చేశారు. వీటి ఆధారంగా చంద్రశేఖర్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. ఈ ఘటనపై సీఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమా? లేక మరేదైనా వ్యక్తిగత కారణం ఉందా? అనే అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..