విశాఖ ఉక్కు ఉద్యమంః ప్రైవేటీకరణ వ్యతిరేక పోరు.. కలిసి రాని నేతలు.. ఏకం చేసే పనిలో కార్మికులు

|

Mar 23, 2021 | 11:11 AM

వైజాగ్ ఉక్కు ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంటుంది. అసలు ఉద్యమం ఎటు నుంచి ఎటు పోతోందో కూడా క్లారిటీ లేదు.. విశాఖపట్నం తీరంలో ఉద్యమకారులు ఆందోళన చేస్తున్నారు.

విశాఖ ఉక్కు ఉద్యమంః ప్రైవేటీకరణ వ్యతిరేక పోరు.. కలిసి రాని నేతలు.. ఏకం చేసే పనిలో కార్మికులు
Protests against privatisation of Vizag plant
Follow us on

Vizag steel plant privatisation agitation: వైజాగ్ ఉక్కు ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంటుంది. అసలు ఉద్యమం ఎటు నుంచి ఎటు పోతోందో కూడా క్లారిటీ లేదు.. విశాఖపట్నం తీరంలో ఉద్యమకారులు ఆందోళన చేస్తున్నారు. కార్మిక సంఘాల నాయకులు ఢిల్లీ వేదికగా విశాఖ ఉక్కు సెగపుట్టిస్తున్నారు. అధికార వైసీపీ ఎంపీలు రాజ్యసభ వేదికగా నిరసన గళం వినిపిస్తున్నారు. అయితే, వైజాగ్ స్టీల్ ఫ్లాంట్‌ను రక్షించుకునేందుకు అందరూ ఏకతాటిపైకి రావాలంటూ ఉద్యమనేతలు డిమాండ్ చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సాగర తీరం ఉద్యమ బాట పట్టింది. దీంతో ఉద్యమం దేశ రాజధాని ఢిల్లీ వేదిక నిరసన గళం వినిపిస్తున్నారు. ప్లాంట్ పరిరక్షణ కమిటీ సభ్యులు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రిని కలిశారు. ప్రాణాలు పోయినా ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటోంది సీపీఐ. స్టీల్‌ ప్లాంట్ అమ్మేసి ఎంపీలు ఏపీలో తిరగగలరా అంటూ ప్రశ్నిస్తోంది.

ఉద్యోగులు, ప్రజా సంఘాలు, వామపక్షాలు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈనెల 26న జరిగే బంద్‌ను విజయం వంతం చేయాలని లెఫ్ట్ పార్టీల నేతలు, ట్రేడ్ యూనియన్ల నాయకులు ఇతర పార్టీల నాయకుల్ని కలుస్తున్నారు. మరోవైపు, సామాజిక బాధ్యత నెరవేర్చడంలో కీలకంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏముందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. వైజాగ్‌ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. స్టీల్ ప్లాంట్ సెగను పార్లమెంట్‌లోనూ రగిలిస్తోంది ఫ్యాను పార్టీ.


ఇదంతా ఒక ఎత్తు… వైజాగ్‌లో గంటాది మరో ఎత్తు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాజీనామా చేశానని ప్రకటించారు. పొలిటికల్ మైలేజ్ చూసుకోవాలి కానీ… మైలేజ్ తగ్గిందేమో.. మొన్ననే తెలంగాణ దాకా వచ్చారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మొన్న రాజీనామా, నిన్న కేటీఆర్‌తో మీటింగ్.. తర్వాతేంటి?. ఎప్పుడూ బిజినెస్సేనా.. కూసింత కలాపోసన కూడా ఉండాలిగా.. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ జేడీతో విశాఖలో తిష్ట వేశారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందాం.. ఎలా చేద్దాం.. ఏం చేద్దాం అంటూ సంప్రదింపులు జరుపుతున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ, న్యాయ పోరాటం అనే కొత్త మార్గాలను ఆవిష్కరించారు.

మరోవైపు ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ ఆసక్తి రేపుతోంది. గంటా శ్రీనివాసరావు అనే పేరెత్తకుండానే.. ట్వీట్‌లోనే గంట మోగించారు. ఆ గంటలో సౌండే తప్ప, మరేం లేదంటూ సెటైర్ వేశారు. ఈ గంటే గతంలో విశాఖలో భూగంట మోగించలేదా అంటూ సమాధానం చెప్పడానికి చాలా కష్టమైన ప్రశ్న సంధించారు. మొత్తంగా చూస్తే…. పార్టీలన్నీ ప్రజల కోసం , ప్లాంట్ పరిరక్షణ కోసం అని చెబుతున్నా.. ఎవరి దారి వారిదే. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటు పరం కాకుండా.. కైలాస గిరి మీద ఉన్న ఆ సర్వేశ్వరుడే రక్షించాలి.

Read Also…  Telangana Assembly Sessions Live Updates: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. నైట్‌ కర్ఫ్యూపై ప్రకటించే ఛాన్స్‌.