ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని హథిరాంజీ మఠంలో నగల మాయం వ్యవహారం కలకలం రేపింది. భక్తులు కానుకగా సమర్పించిన 108 గ్రాముల బంగారు డాలర్తో పాటు 70 గ్రాముల హారం మాయమైనట్లు మఠం అధికారులు గుర్తించారు. 2014లో తిరుమలకు చెందిన ఉలగనాధం అనే భక్తుడు ఈ హారం, డాలర్ని కానుకగా సమర్పించారు.
కాగా మఠంలో క్యాషియర్, అకౌంటెంట్గా పని చేస్తున్న గురప్ప ఫిబ్రవరి 18న మృతి చెందగా.. నగల మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో మఠంలో నగలు, ఆస్తులకు సంబంధించి ఈ నెల 8 నుంచి వెరిఫికేషన్ కొనసాగిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో రికార్డులున్న బీరువాలను అధికారులు సీజ్ చేశారు. మరోవైపు మఠం మహంతు అర్జున్ దాస్ మాట్లాడుతూ.. నగలు కనిపించడం లేదని అంగీకరించారు. అయితే నగల మాయంపై మఠం వర్గాలు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.