Vijayawada: కడుపు కోతను ‘కరుణ’గా మార్చిన తల్లి.. ఆమె కథ వింటే హృదయం చలిస్తుంది..

అమర్‌నాథ్ యాత్రలో ఇద్దరు కుమారులను కోల్పోయిన విజయవాడకు చెందిన పాలడుగు సుజాత.. ఆ విషాదాన్ని జీవకారుణ్యంగా మలిచారు. రోడ్డుపై గాయపడిన ఓ వీధి కుక్కకు చికిత్స అందించడం నుంచి ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 200కు పైగా అనాథ, గాయపడిన శునకాలకు ఆశ్రయం కల్పించే "సాయి జీవకారుణ్య సేవా సంస్థ"గా విస్తరించింది.

Vijayawada:  కడుపు కోతను కరుణగా మార్చిన తల్లి.. ఆమె కథ వింటే హృదయం చలిస్తుంది..
Paladugu Sujatha

Edited By:

Updated on: Jul 26, 2026 | 6:29 PM

 

కన్న పిల్లలు దూరమైతే ఏ తల్లి గుండె అయినా తట్టుకోగలదా..? ఆ బాధ నుంచి కోలుకోవడం అంత సులభమా..? కానీ విజయవాడకు చెందిన పాలడుగు సుజాత తన కన్నీటిని జీవకారుణ్యంగా మార్చుకున్నారు. గాయపడిన, అనారోగ్యంతో బాధపడుతున్న వీధి కుక్కలకు ఆశ్రయం కల్పిస్తూ.. విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో 240కు పైగా మూగజీవాలకు తల్లిగా మారారు.

2008లో అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ఇద్దరు కుమారులు మృతిచెందారు. ఆ విషాదంతో తీవ్ర మనోవేదనకు గురైన సుజాత.. ఒకరోజు రోడ్డుపై గాయాలతో నడవలేకపోతున్న ఓ వీధి కుక్కను చూసి ఇంటికి తీసుకొచ్చి చికిత్స అందించారు. ‘శేషు’ అని పేరు పెట్టి ప్రేమగా చూసుకున్నారు. అదే ఆమె జీవితంలో కొత్త ఆశకు నాంది పలికింది.

“నా కొడుకులు చనిపోయాక జీవితం ముగిసిపోయిందనుకున్నా. కానీ శేషు రూపంలో దేవుడు నాకు మరో కారణం ఇచ్చాడు. రోడ్డుపై బాధపడుతున్న ఈ మూగజీవాల్లో నా పిల్లలనే చూస్తాను. అందుకే నా మిగిలిన జీవితాన్ని వీటికోసమే అంకితం చేశాను” అని పాలడుగు సుజాత భావోద్వేగంగా చెబుతున్నారు.

ఆ ఆలోచనతోనే 2008లో ‘సాయి జీవకారుణ్య సేవా సంస్థ’ను స్థాపించారు. కొత్తూరు తాడేపల్లిలోని మామిడితోటలో ఏడాదికి రూ.35 వేల అద్దె చెల్లిస్తూ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవి, యజమానులు వదిలేసినవి, అనారోగ్యంతో బాధపడుతున్న వందలాది శునకాలకు ఆశ్రయం కల్పిస్తున్నారు.

ప్రతిరోజూ 20 లీటర్ల పాలు, పెరుగు, 50 కిలోల బియ్యంతో ఆహారం అందిస్తుండగా.. ఆశ్రమ నిర్వహణకు నెలకు సుమారు లక్షన్నర ఖర్చవుతోంది. ఆరుగురు మహిళా సిబ్బంది సంరక్షణలో భాగస్వాములవుతున్నారు. కష్టాలు ఎన్ని వచ్చినా మూగజీవాల సేవలో మాత్రం పాలడుగు సుజాత వెనక్కి తగ్గడం లేదు.

Follow Us