
మనుషుల మధ్య మానవత్వం మసకబారుతున్న ఈరోజుల్లో.. మాట్లాడలేని మూగజీవాల ప్రాణాల కోసం పరుగులెత్తాయి కొన్ని చేతులు..! విజయవాడలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాయి. డ్రైనేజీ కాలవలో చిక్కుకున్న రెండు !ఎద్దులను ట్రాఫిక్ పోలీసులు, విఎంసీ సిబ్బంది క్రేన్ సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు. ఇప్పుడు విజయవాడ ట్రాఫిక్ పోలీసుల సమయస్పూర్తికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మూగజీవాల ప్రాణాల కోసం ట్రాఫిక్ పోలీసులు, విఎంసీ సిబ్బంది, స్థానికులు కలిసి పరుగులెత్తారు. ఈ సంఘటన విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలో రెండు ఎద్దులు ప్రమాదవశాత్తు జారిపడ్డాయి. ఇరుకైన కాలవలో శరీరం నలిగిపోయి బయటకు రావడానికి అవి చేసిన పోరాటం చూసినా వారిని కలిచివేసింది. తల పైకెత్తి సహాయం కోసం చూసే ఆ కళ్ళల్లో భయం, అలసట, ప్రాణం కోసం అర్తనాదం చూసే వారందరికీ స్పష్టంగా కనిపించింది.
దీంతో సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు క్షణాలలో అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ డ్యూటీ మధ్యలోనే ముందు ప్రాణాలు కాపాడాలి అన్న ఒక్క ఆలోచనతో రెస్క్యూ చర్యలు ప్రారంభించారు. విఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసి క్రేన్ ను తీసుకువచ్చారు. డ్రైనేజీలో ఇరుక్కుపోయిన ఎద్దులకు బెల్టులు కట్టడం కూడా సవాలుగా మారింది. భయంతో అవి కదలాడుతుండగా సిబ్బంది వాటిని నిమురుతూ ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ క్రేన్ సహాయంతో నెమ్మదిగా పైకి లాగారు. చుట్టూ చేరిన స్థానికులు కూడా సహాయం చేశారు. ఆ క్షణాల్లో అక్కడ ఉన్న వారందరూ ఒక కుటుంబంలో మారిపోయారు.
కొన్ని ఉత్కంఠ నిమిషాల తర్వాత రెండు ఎద్దులను సురక్షితంగా బయటకు తీశారు. నేలమీద నిలబడగానే అవి తేరుకుని నడవడం చూసి అందరి ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. డ్యూటీ పరిమితులని దాటి మూగజీవాల ప్రాణాలను తమ ప్రాణంలా భావించి కాపాడిన ట్రాఫిక్ పోలీసులు విఎంసీ సిబ్బంది కి జంతు ప్రేమికులు అభినందనలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..