AP News: ఇది విన్నారా.. ఇకపై విజయవాడ టూ ముంబై.. గంటన్నర ప్రయాణమే..

| Edited By: Ravi Kiran

Jun 15, 2024 | 12:10 PM

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో విజయవాడకు సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముంబయి నగరానికి ఎయిర్‌ ఇండియా సంస్థ నూతన సర్వీసును నేటి నుంచి ప్రారంభించనుంది. ఎంపీ బాలశౌరి ఎయిర్‌పోర్టు అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో గతంలో పలుమార్లు.. ఆ వివరాలు..

AP News: ఇది విన్నారా.. ఇకపై విజయవాడ టూ ముంబై.. గంటన్నర ప్రయాణమే..
Representative Image
Follow us on

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో విజయవాడకు సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముంబయి నగరానికి ఎయిర్‌ ఇండియా సంస్థ నూతన సర్వీసును నేటి నుంచి ప్రారంభించనుంది. ఎంపీ బాలశౌరి ఎయిర్‌పోర్టు అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో గతంలో పలుమార్లు విజయవాడ నుంచి ముంబయి నగరానికి విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రిని, అధికారులను కలిశారు. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఇవాళ గన్నవరం నుంచి ముంబయి నగరానికి విమాన సర్వీసు ప్రారంభం కానుంది.

గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి విజయవాడ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరానికి ఎయిర్ ఇండియా వారి విమాన సేవలను ప్రారంభం కానుండగా.. ఈ విమాన సర్వీసును మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. దీంతో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు పట్టణ పరిసర ప్రాంత వ్యాపారులు, ఇతర అవసరాల నిమిత్తం విజయవాడ నుంచి ముంబయికి, ముంబయి నుంచి విజయవాడ వచ్చేందుకు వీలుకలగుతుంది.

కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విమాన సౌకర్యం కల్పించవలసినదిగా గతంలో ఎంపీ బాలశౌరి అనేకమార్లు కోరారు. అంతేకాకుండా ఢిల్లి లోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, అధికారులతో గతంలో ఇదే విషయంపై పలుమార్లు ఆయన సమావేశం నిర్వహించారు. సదరు చర్చల ఫలితంగా రేపటి నుంచి ముంబయి నగరానికి నూతన విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ సందర్బంగా విజయవాడ నుంచి ముంబయి నగరానికి విమాన సర్వీసు ఏర్పాటు కావడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎంపీ బాలశౌరి కృషి తీరుపై ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇవాళ సాయంత్రం 5.45 గంటలకు ముంబయి నుంచి విజయవాడకు విమానం వస్తుంది. తిరిగి 7.10 గంటలకు విజయవాడ నుంచి ముంబయికు అదే విమానం వెళ్లనుంది. రోజూ ఇదేవిధంగా సర్వీసు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఏవైనా మార్పులు ఉంటే తెలియజేస్తామన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లయిట్ AI 599 నంబరుపై సర్వీసు ప్రతి రోజు అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 180 మంది ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణించవచ్చన అధికారులు చెబుతున్నారు.

గన్నవరం(విజయవాడ) ఎయిర్‌పోర్టు నుంచి ముంబయికి నూతనంగా ప్రారంభం కానున్న ఎయిర్‌ ఇండియా సర్వీసు అందుబాటులోకి వస్తే.. విదేశాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ముంబయి నుంచి అనేక దేశాలకు విమాన సర్వీసులు ఉన్నాయి.. దీంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న విమాన సర్వీసు ఆయా దేశాలకు వెళ్లే కనెక్టింగ్‌ ఫ్లైట్‌గా సేవలు అందించనుంది. చివరిగా కోరిన వెంటనే విమాన సర్వీసు మంజూరు చేయించిన కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖకు ఎంపీ బాలశౌరి ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..