Vijayasai reddy: విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్… రాజకీయ వర్గాల్లో కలకలం

విజయసాయిరెడ్డి మరోసారి ఎక్స్‌లో ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఈ సారి కొత్త పంథాన్ని ఎంచుకున్నారు. ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే ఆయన.. ఇప్పుడు హిందూత్వంపై జరుగుతున్న దాడులపై ఘాటుగా స్పందించారు. అంతేకాదు హిందువుల జోలికి వస్తే సహించేది లేదంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.

Vijayasai reddy: విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్... రాజకీయ వర్గాల్లో కలకలం
Vijayasai Reddy

Updated on: Dec 07, 2025 | 6:20 PM

Andhra News: మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లబుచ్చుతూ ఉంటారు. పదునైన విమర్శలతో ఆయన చేసే ట్వీట్లు హాట్‌టాపిక్‌గా మారుతూ మీడియాకెక్కుతుంటాయి. ఏడాది క్రితం వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడిన దాఖరాలు లేవని చెప్పుకోవాలి. అయితే తాజాగా విజయసాయరెడ్డి మళ్లీ ఎక్స్‌లో ఫుల్ యాక్టివ్ అయ్యారుజ తన సహాజశైలిని ప్రదర్శిస్తూ తాజాగా పదునైన వ్యాఖ్యలతో ఆయన చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. హిందూ మతంపై జరుగుతున్న దాడిని ఆయన ఖండిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

డబ్బులిచ్చి హిందువుల్ని వేరే మతంలోకి లాగుతున్నారనే మాటను ప్రస్తావిస్తూ ఆయన ఎక్స్‌లో ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హిందూ మతంపై జరిగే కుట్రలు సహించేది లేదన్న ఆయన.. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామని పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దేశం కోసం ధర్మం కోసం హిందువులలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని, అదే భారతదేశానికి రక్ష … శ్రీరామ రక్ష అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. గతానికి భిన్నంగా విజయసాయిరెడ్డి చేసిన ఈ పోస్టే ఇప్పుడు చాలా ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆయన ప్రస్తావించిన అంశాలు కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి.

కాగా దాదాపు ఏడాదిగా విజయసాయిరెడ్డి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జగన్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు. పాలిటిక్స్‌కి గుడ్‌బై చెప్పినా.. తాజా రాజకీయ అంశాలపై తనదైన శైలిలో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు మత మార్పిడులకు ఆయన వ్యతిరేకంగా గళమెత్తడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఇదిప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం గతంలో జరగ్గా.. ఆయన ఖండించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఆయనకు స్నేహా సంబంధాలు ఉండటంతో జనసేనలో చేరతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి.  కానీ విజయసాయిరెడ్డి తాజా ట్వీట్‌తో ఆయన పొలిటికల్ రీఎంట్రీపై మళ్లీ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా జాతీయ పార్టీలో విజయసాయిరెడ్డి చేరుతారా? ఆ ఉద్దేశంతోనే ఈ ట్వీట్ చేసి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి విజయసాయిరెడ్డి ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఎలాంటి దుమారం రేపుతుంది అనేది చూడాలి.