
ఆంధ్రప్రదేశ్లో జరిగిన వేట్లపాలెం ఘటన అత్యంత దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఘోర ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం, బాధితుల కుటుంబాలను పరామర్శించి.. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందగా, మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు కారణమైన పరిస్థితులను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. మృతుల కుటుంబాల్లోని పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన లేదా ఇళ్లు లేని బాధితులకు కొత్త ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతామని సీఎం స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించిన ఆయన, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు సీఎం ప్రకటించారు. ఘటనకు కారణమైన దోషుల ఆస్తులను జప్తు చేసి, వారికి జీవిత ఖైదు పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.