AP News: పండుగపూట యువకుల ప్రాణం తీసిన సరదా.. కాల్వలో ఈత కొట్టేందుకు దిగి..

West Godavari District: పండుగపూట ఆ గ్రామంలో విషాదం నెలకొంది. పండుగ వేడుకలను జరుపుకుందామని గ్రామానికి వచ్చిన స్నేహితుల్లో

AP News: పండుగపూట యువకుల ప్రాణం తీసిన సరదా.. కాల్వలో ఈత కొట్టేందుకు దిగి..

Updated on: Jan 17, 2022 | 12:09 PM

West Godavari District: పండుగపూట ఆ గ్రామంలో విషాదం నెలకొంది. పండుగ వేడుకలను జరుపుకుందామని గ్రామానికి వచ్చిన స్నేహితుల్లో ఇద్దరు మరణించారు. కాల్వలోకి స్నానానికి దిగిన ఆరుగురు యువకుల్లో ఇద్దరు నీటమునిగి మరణించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో చోటుచేసుకుంది. రాజవరం గ్రామ శివారులో ఉన్న ఎర్ర కాలువలో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సంక్రాంతి పండుగ కావడంతో జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు రాజవరంలో ఉన్న ఎర్ర కాల్వ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అంతా కలిసి కాల్వలోకి స్నానానికి దిగారు.

కొంతసేపటి తర్వాత.. వీరిలో జెట్టి ముఖేష్( 21) జెట్టి గణేష్ (20) లోతులోకి వెళ్లారు. ఈత రాకపోవడం, కాల్వ లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు. మిగతా నలుగురు స్నేహితులు గట్టుపైకి చేరారు. దీంతో ఆ నలుగురు యువకులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థులంతా అక్కడికి చేరుకొని ఇద్దరు యువకులు మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యలగూడెం పోలీసులు తెలిపారు.

ఈ యువకులంతా చదువుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. చేతికొచ్చిన కొడుకులు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read:

Chittoor: మదనపల్లెలో దారుణం.. పొట్టేలును బలి ఇవ్వబోయి యువకుడి తలను నరికాడు.. మద్యం మత్తులో..

Viral Video: నాటు నాటు పాటకు క్రేజ్ మాములుగా లేదుగా.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే..

Follow Us