
ఏపీలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గోదావరి నదిలో చేపల వేటలకని వెళ్లి ఐదుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసే పనిలో పడ్డారు. స్థానిక సమాచారం ప్రకారం.. గొల్లగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలోకి ఐదుగురు వ్యక్తులు చేపల వేట కోసం వెళ్లారు. అయితే నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు.
బాధితుల కేకలు విన్న స్థానికులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయంతో గాలింపు చేపట్టి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఒకే రోజు ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గొల్లగూడెంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆమె తన గాఢ సానుభూతిని ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.