
ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే.. మూడు ప్రాణాలు కృష్ణా జలాల్లో కలిసిపోయేవి. కానీ సమయానికి స్పందించిన బెజవాడ పోలీసులు ఆ విషాదాన్ని అడ్డుకుని ఒక కుటుంబాన్ని మళ్లీ జీవితానికి చేర్చారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురైన కృష్ణా జిల్లా చిలకలపూడి చెందిన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి మౌనంగా విజయవాడకు చేరుకుంది. ఇంట్లో చనిపోతాను అని చెప్పి బయలుదేరిన ఆమె గురించి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన చిలకలపూడి పోలీసులు విజయవాడ కంట్రోల్ రూమ్ను అలర్ట్ చేశారు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ఆ సమాచారం అందుకున్న వెంటనే నగరంలోని సంబంధిత పోలీస్ స్టేషన్లో , ట్రాఫిక్ బృందాన్ని అప్రమత్తం చేశారు.
ఇంతలో ప్రకాశం బ్యారేజిపై ఆ మహిళ తన ఇద్దరు చిన్నారులతో నిలబడి ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైంది. పరిస్థితి తీవ్రతను గమనించిన ట్రాఫిక్ ఆర్ఎస్ఐ శ్రీధర్, హెడ్ కానిస్టేబుల్ భూషణం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు దూకారు. చాకచక్యంగా స్పందించి మహిళను చిన్నారులను సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ క్షణంలో చోటు చేసుకున్న ఆందోళన పరుగులు ఆపదలో ఉన్న పిల్లల ఏడుపు అన్ని క్షణాల్లోనే జరిగిపోయాయి.
పోలీసులు తక్షణం స్పందించి ముగ్గురు ప్రాణాలు కాపాడారు. అనంతరం వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి తదుపరి చర్యలను చేపట్టారు.. ఈ సంఘటన పై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పందిస్తూ.. విషమ పరిస్థితుల్లో పోలీసులు చూపిన అప్రమత్తను అభినందించారు. సమయానికి స్పందిస్తే ఎంతటి విషాదంనైనా నివారించవచ్చుని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..