MLC Ramesh Yadav: ప్రాణాలు కావాలంటే ఊరు వదిలి వెళ్లిపో.. అధికార పార్టీ ఎమ్మెల్సీకి బెదిరింపు కాల్స్!

|

Jul 13, 2021 | 5:45 PM

ప్రాణాలు కావాలంటే ఊరు వదిలి వెళ్లిపో.. లేదంటే టీడీపీ నేత నందం సుబ్బయ్య సమాధి పక్కనే నీ సమాధి లేస్తుందంటూ.. అటు నుంచి వార్నింగ్స్..

MLC Ramesh Yadav: ప్రాణాలు కావాలంటే ఊరు వదిలి వెళ్లిపో.. అధికార పార్టీ ఎమ్మెల్సీకి బెదిరింపు కాల్స్!
MLC Ramesh Yadav
Follow us on

Threat Calls To YCP MLC Ramesh Yadav: ప్రాణాలు కావాలంటే ఊరు వదిలి వెళ్లిపో.. లేదంటే టీడీపీ నేత నందం సుబ్బయ్య సమాధి పక్కనే నీ సమాధి లేస్తుందంటూ.. అటు నుంచి వార్నింగ్స్.. ఇదేదో అషామాషీ నేతకు ఆకతాయిల నుంచి వచ్చిన బెదిరింపులు కాదు. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్సీకి కొందరు అగంతకులు వార్నింగ్. ఫోన్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్స్‌ వ్యవహారం కడప జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని ఆశించిన రమేష్‌ యాదవ్‌కు అప్పుడు కుల సమీకరణాల్లో భాగంగా పదవి దక్కలేదు. తర్వాత వైసీపీ అధిష్టానం అతడికి గవర్నర్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన రమేష్‌ యాదవ్కు వరుస బెదిరింపు కాల్స్‌ రావడంతో.. ఆయనకు కొత్త కష్టాలొచ్చాయి. ఎమ్మెల్సీ గా ఎన్నికైన రెండు రోజులకే రమేష్ యాదవ్ కి ఇంటర్నెట్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయి.. జూన్ 25 వ తేదీ అర్ధరాత్రి 12:25 నిమిషాలకు మొదటి బెదిరింపు కాల్స్ రాగా, కంటిన్యూగా మరోసటి రోజు మధ్యాహ్నం వరకు చంపేస్తాం, జాగ్రత్తగా ఉండు ఖబడ్దార్ అంటూ ఇంటర్నెట్ ద్వారా బెదిరింపులుకు దిగారు. దీనితో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రొద్దుటూరు డిఎస్పీ ప్రసాద్ రావుకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.

ఈ కాల్స్‌ అన్నీ వాట్సాప్‌ కాల్స్‌ కావడంతో.. ఫోన్‌ ట్రాక్‌ చేయడం పోలీసులకు సవాల్‌‌గా మారింది. ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ను స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన అనుచరులతో కాల్‌ చేయించి బెదిరింపులకు దిగారని ఆరోపణలొస్తున్నాయి. ప్రొద్దుటూరు రాజకీయాల్లో రమేష్‌ యాదవ్‌ తనదైన ముద్ర వేయడాన్ని రాచమల్లు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు ఎమ్మెల్సీ అనుచరులు. ఈ వివాదంపై స్పందించిన రాచమల్లు.. రమేష్‌ యాదవ్‌తో తనకెలాంటి వైరం లేదన్నారు. రాజకీయంగా, వ్యాపార పరంగా వివాదాలేమీ లేవన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజులకే బెదిరించాల్సిన అవసరం ఏముందన్నారు.

నందం సుబ్బయ్య మర్డర్‌ అయినట్లు అవుతావని అన్నారంటే.. ఎవరో తెలిసిన వారే ఈ బెదిరింపులకు పాల్పడి ఉంటారని, అటు, తెలుగు దేశం పార్టీ నేతలంటున్నారు. సుబ్బయ్య హత్యకు, ఈ కాల్స్ చేసిన వారితో సంబంధాలు ఉండి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి దుండగులు ఎవరన్నదీ తేల్చాలని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అనుచరులు కోరుతున్నారు.

అయితే కాల్స్ వచ్చి 16 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు విచారణలో ఆగంతకుడు ఎవరు అనేది ఇంత వరకు తేలలేదు. ఎమ్మెల్సీగా రమేష్ యాదవ్ ప్రొద్దుటూరులో రాజకీయంగా ఎదుగుతున్నారనే ఉద్దేశ్యంతోనే బెదిరింపు ఫోన్ కాల్స్ ద్వారా కట్టడి చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు ఇలా బెదిరింపులుకు పాల్పడ్డారని ఎమ్మెల్సీ అనుచరులు ఆరోపిస్తున్నారు. కాగా, రమేష్ యాదవ్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also… Revanth Reddy: తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ!