
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు, లోకేశ్పై మాజీ మంత్రి జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. ఆయన నివాసంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. అనంతరం నివాసానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీగా అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అల్లర్లు మరింత చెలరేగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ తన నివాసంలో లేరని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితిపై ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.