పవన్ లేకుండానే టీడీపీ-జనసేన సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చే అవకాశం..

తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండ‌బోతుంది.? రెండు పార్టీలు క‌లిసి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఎలా చేస్తాయి. ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల్లో ఆస‌క్తిగా మారింది. టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదిరి రోజులు గ‌డిచిపోతుంది. అయినా ఉమ్మడి పోరాటాల‌పై మాత్రం స్పష్టత రావడం లేదు. రెండు పార్టీలు క‌లిసి ఎలా ముందుకెళ్లాల‌నే దానిపై ఉమ్మడి కార్యాచ‌ర‌ణ క‌మిటీ ఏర్పాటు చేసాయి.

పవన్ లేకుండానే టీడీపీ-జనసేన సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టోపై క్లారిటీ వచ్చే అవకాశం..
Tdp Janasena Meeting

Edited By: TV9 Telugu

Updated on: Nov 09, 2023 | 4:20 PM

తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండ‌బోతుంది.? రెండు పార్టీలు క‌లిసి క్షేత్రస్థాయిలో పోరాటాలు ఎలా చేస్తాయి. ఇదంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల్లో ఆస‌క్తిగా మారింది. టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదిరి రోజులు గ‌డిచిపోతుంది. అయినా ఉమ్మడి పోరాటాల‌పై మాత్రం స్పష్టత రావడం లేదు. రెండు పార్టీలు క‌లిసి ఎలా ముందుకెళ్లాల‌నే దానిపై ఉమ్మడి కార్యాచ‌ర‌ణ క‌మిటీ ఏర్పాటు చేసాయి. ఈ క‌మిటీ మొద‌టిసారి రాజ‌మండ్రిలో స‌మావేశ‌మైంది. ప్రభుత్వంపై ఆందోళ‌న‌ల కంటే రెండు పార్టీల క‌ల‌యిక‌పైనే ముందుగా దృష్టి పెట్టాయి. రాష్ట్ర స్థాయిలో జ‌రిగిన స‌మావేశానికి నారా లోకేష్‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రై క్యాడర్‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఇక ఆ త‌ర్వాత జిల్లా స్థాయిలో స‌మ‌న్వయ స‌మావేశాలు జ‌రిగాయి. రెండు పార్టీల మ‌ధ్య ఎలాంటి పొర‌ప‌చ్చాలు లేకుండా క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగడంపైనే చ‌ర్చించాయి. ఒక‌రకంగా చెప్పాలంటే ఈ సమావేశాలు క్యాడర్ మ‌ధ్య క‌ల‌యిక కోసం ఏర్పాటు చేసిన‌వే. ముఖ్యంగా పొత్తు వ‌ల్ల రెండు పార్టీల నాయ‌కుల్లో గానీ కార్యక‌ర్తల్లో గానీ మ‌న‌స్పర్ధలు లేకుండా ముందుకెళ్లేలా ఈ స‌మావేశాలు నిర్వహించారు. మ‌రోవైపు ఓటు బ‌ద‌లాయింపుపైనా స‌మ‌న్వయ స‌మావేశాల్లో చర్చించారు. రెండు పార్టీల ఓట్లు ఇత‌ర పార్టీల‌కు మ‌ళ్లకుండా ఉమ్మడి అభ్యర్ధికే ఖ‌చ్చితంగా వేసేలా చూడాల‌ని స‌మావేశంలో అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తంగా రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో జ‌రిగిన సమావేశాల్లో ఎలాంటి కార్యాచ‌ర‌ణ లేకుండా క‌లిసిక‌ట్టుగా సాగ‌డంపైనే చ‌ర్చించాయి. తాజాగా న‌వంబ‌ర్ తొమ్మిదో తేదీన మ‌రోసారి రాష్ట్ర జేఏసీ స‌మావేశం అవుతుంది. ఈ స‌మావేశంలో అన్ని అంశాల‌పై క్లారిటీ ఇచ్చే దిశ‌గా రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి.

ఉమ్మడి స‌మావేశంలో మేనిఫెస్టోపై క్లారిటీ ఇచ్చే దిశ‌గా టీడీపీ-జన‌సేన‌..

ఈ నెల తొమ్మిదో తేదీని టీడీపీ-జ‌న‌సేన ఉమ్మడి స‌మావేశం విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నుంది. ముందుగా ఈ స‌మావేశాన్ని మంగ‌ళగిరిలోని టీడీపీ కార్యాల‌యంలో జ‌ర‌పాల‌ని నిర్ణయించినప్పటికీ వేదిక‌ను విజ‌య‌వాడ‌కు మార్చారు. ఓ ప్రయివేట్ హోట‌ల్‌లో జరిగే ఈ స‌మావేశానికి నారా లోకేష్‌తో పాటు జేఏసీలోని 12 మంది స‌భ్యులు హాజ‌రుకానున్నారు. అయితే జ‌న‌సేన నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ స‌మావేశానికి హాజ‌రుకావ‌డం లేదు. ఈ స‌మావేశంలో కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. గ‌త స‌మావేశంలో మేనిఫెస్టోపై ప‌వ‌న్ క‌ళ్యాణ్-నారా లోకేష్ చ‌ర్చించారు. ఆ త‌ర్వాత ఇటీవ‌ల చంద్రబాబుతో భేటీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా మేనిఫెస్టో విడుద‌ల‌పైనే ఎక్కువ‌గా చ‌ర్చించారు. దీనికి కొన‌సాగింపుగా గురువారం జ‌రిగే స‌మావేశంలో మేనిఫెస్టోకు తుదిరూపు తీసుకురానున్నారు. ఇప్పటికే సూప‌ర్ సిక్స్ పేరిట తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది. ఇది ప్రిలిమిన‌రీ మేనిఫెస్టో మాత్రమే..వాస్తవంగా విజ‌య‌ద‌శ‌మి రోజు పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని చంద్రబాబు అరెస్ట్‌కు ముందు ప్రక‌టించారు. అది వాయిదా ప‌డింది. సూప‌ర్ సిక్స్‌తో పాటు మ‌రికొన్ని అంశాల‌తో టీడీపీ ప్రతిపాద‌న‌లు సిద్దం చేసింది. అటు జ‌న‌సేన కూడా ష‌ణ్ముక వ్యూహం పేరుతో రెండేళ్ల క్రితం ప్రక‌టించిన అంశాల‌న్నీ మేనిఫెస్టోలో పొందుప‌రిచేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్లు స‌మాచారం. రెండు పార్టీల నుంచి ఉన్న ప్రతిపాద‌న‌ల‌పై చ‌ర్చించిన త‌ర్వాత మేనిఫెస్టోపై ఓ స్పష్టత‌కు రానున్నట్లు తెలిసింది. త్వర‌లో పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుద‌ల దిశ‌గా రెండు పార్టీలు సిద్దమ‌వుతున్నాయి. ఇక గురువారం జ‌రిగే స‌మావేశంలో రైతుల స‌మ‌స్యల‌పై కూడా చ‌ర్చించ‌నున్నారు. రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువు, రైతుల‌ను ఆదుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నట్లు తెలిసింది.

దీపావ‌ళి త‌ర్వాత ఉమ్మడి పోరాటాల‌కు సిద్దమ‌వుతున్న రెండు పార్టీలు..

తొమ్మిదో తేదీ ఉమ్మడి స‌మావేశంలో తీసుకునే నిర్ణయాల‌పై మ‌రోసారి చంద్రబాబు-ప‌వ‌న్ భేటీలో చ‌ర్చిస్తారు. దీపావ‌ళి త‌ర్వాత మ‌రోసారి ఇద్దరు నేత‌లు స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలోనే మేనిఫెస్టో విడుద‌ల‌కు తేదీని ఖ‌రారు చేయ‌నున్నారు. మ‌రోవైపు ఉమ్మడి పోరాటాల‌కు కూడా దీపావ‌ళి త‌ర్వాత ప్రత్యేక షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. చంద్రబాబు-ప‌వ‌న్ భేటీ కంటే ముందుగానే జేఏసీ నేత‌లు తాత్కాలిక షెడ్యూల్, మేనిఫెస్టోల‌కు తుదిరూపు తీసుకురానున్నారు. మొత్తానికి వ‌చ్చే వారం నుంచి దూకుడు పెంచేలా టీడీపీ-జ‌న‌సేన ప్రణాళిక‌తో ముందుకెళ్తున్నాయి.