మూడు గంటలు లిఫ్ట్‌లో నరకయాతన.. ఏం జరిగిందంటే!

రైల్వే స్టేషన్లు, మెట్రో రైల్వే స్టేషన్లలో వృద్ధులు, లగేజ్‌తో మెట్టు ఎక్కలేని వారి కోసం లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తుంటారు. అయితే వృద్ధులే కాకుండా ఈ లిఫ్ట్‌లను అందరూ ఉపయోగిస్తుంటారు. అంతవరకూ ఓకే. కానీ పరిమితికి మించి లిఫ్ట్‌ ఎక్కేస్తుంటారు ఒక్కోసారి. దాంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఒంగోలు జిల్లాలో చోటుచేసుకుంది.

మూడు గంటలు లిఫ్ట్‌లో నరకయాతన.. ఏం జరిగిందంటే!
Lift Stuck

Edited By:

Updated on: Feb 02, 2025 | 12:26 PM

రైల్వే స్టేషన్లు, మెట్రో రైల్వే స్టేషన్లలో వృద్ధులు, లగేజ్‌తో మెట్టు ఎక్కలేని వారి కోసం లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తుంటారు. అయితే వృద్ధులే కాకుండా ఈ లిఫ్ట్‌లను అందరూ ఉపయోగిస్తుంటారు. అంతవరకూ ఓకే. కానీ పరిమితికి మించి లిఫ్ట్‌ ఎక్కేస్తుంటారు ఒక్కోసారి. దాంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఒంగోలు జిల్లాలో చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌కు వచ్చిన కొందరు భక్తులు పరిమితికి మించి లిఫ్ట్‌ ఎక్కడంతో లిఫ్ట్‌ కదలకుండా మొరాయించింది. అంతేకాదు దిగిపోదామా అంటే డోర్లు కూడా తెరుచుకోకపోవడంతో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు భక్తులు.

వాళ్ళంతా తిరుపతికి వెళ్ళి తిరిగివచ్చారు. వెంకటేశ్వరస్వామి దర్శనం బాగా జరిగిందన్న ఆనందంలో భక్తులంతా కలిసి ప్రకాశంజిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్‌లో దిగారు. స్టేషన్‌ బయటకు వెళ్ళేందుకు ప్లాట్‌ఫాంపై ఉన్న లిఫ్ట్‌ను ఎక్కారు. అయితే ఇక్కడే ఈ భక్తులు ఒక తప్పు చేశారు. లిఫ్ట్‌లో పరిమితికి మించి ఎక్కేశారు. అంతే లిఫ్ట్‌ తలుపులు మూసుకుపోయిన తరువాత లిఫ్ట్‌ మొరాయించింది. అధిక బరువు ఉండటంతో కదలలేకపోయింది.కదలకపోతే కదలకపోయింది కనీసం తలుపులు కూడా తెరుచుకోకపోవడంతో 14 మంది భక్తులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. మూడు గంటల పాటు బయటకు రాలేక నరకయాతన అనుభవించారు.

సమాచారం అందుకున్న రైల్వే ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది వెంటనే లిఫ్ట్‌ దగ్గరకు చేరుకుని మూడు గంటల పాటు శ్రమించి లిఫ్ట్‌లో చిక్కుకున్న 14 మంది భక్తులను సురక్షితంగా బయటకు తీశారు. ఆర్‌పిఎఫ్‌ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి లిఫ్ట్‌ పైభాగం నుంచి భక్తులను బయటకు వచ్చేందుకు సహకరించారు… అప్పటికే ఆందోళనకు గురైఉన్న భక్తులు మరింత ఆందోళన చెందకుండా కూల్‌గా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతూనే వాళ్ళంతా బయటకు వచ్చేందుకు సహాయ సహకారాలు అందించారు. దీంతో లిఫ్ట్‌లో చిక్కుకున్న 14 మంది భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. భక్తుల కోసం తీవ్రంగా శ్రమించి వారి ప్రాణాలను కాపాడిన ఆర్ పి ఎఫ్ సిబ్బందికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us