
గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా స్త్రీనిధి స్కీమ్లో ఏపీ ప్రభుత్వం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అవసరానికి ఆదుకోని అప్పు వ్యర్థం అనే ఉద్దేశంతో స్త్రీనిధి రుణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. పాతకాలపు రాతలకు స్వస్తి పలికి, డిజిటల్ హంగులతో బ్యాంకింగ్ సేవలను మహిళా సంఘాల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ప్రక్షాళన మొదలైంది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే డ్వాక్రా మహిళలకు రుణం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల అత్యవసర ఆరోగ్య సమస్యలు, పెళ్లిళ్లు లేదా ఇతర అవసరాల కోసం మహిళలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లి మైక్రో ఫైనాన్స్ ఊబిలో చిక్కుకోకుండా రక్షణ లభించనుంది.
స్త్రీనిధి కార్యకలాపాల కోసం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్ను ప్రభుత్వం తీసుకువస్తోంది. బయోమెట్రిక్ విధానం ద్వారా కాగితం పని లేకుండానే రుణాల దరఖాస్తు, మంజూరు ప్రక్రియ జరుగుతుంది. రుణాలు తిరిగి చెల్లించడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వంటివి ఈ యాప్ ద్వారా సులభతరం కానున్నాయి.
డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణాల పరిమితిని ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గతంలో రూ.5 లక్షల వరకు ఉన్న రుణ పరిమితిని ఇప్పుడు రూ.8 లక్షలకు పెంచారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.12,000 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఇది కేవలం రూ.2,000 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం.
స్త్రీనిధి బ్యాంకింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నియామకాల్లో నిబంధనల ప్రకారం 57 మంది మహిళలు ఉండాల్సి ఉండగా, ప్రభుత్వం ఏకంగా 97 మంది మహిళలకు అవకాశం కల్పించి మహిళా పక్షపాతాన్ని చాటుకుంది. వీవోఏలు, బుక్ కీపర్లుగా అనుభవం ఉన్న వారికి ఈ పోస్టుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వీరు నియోజకవర్గ స్థాయిలో ఉండి మహిళా సంఘాలకు బ్యాంకింగ్ సేవల్లో తోడ్పాటు అందిస్తారు.
స్త్రీనిధిని పూర్తిస్థాయి బ్యాంకింగ్ సంస్థగా తీర్చిదిద్దేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ స్థాయి అధికారిని ఎండీగా నియమించారు. దీనివల్ల బ్యాంకుల కంటే వేగంగా, పారదర్శకంగా పేద మహిళలకు రుణ పరపతి లభించనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.